బాన్సువాడలో పట్టు బిగిస్తున్న కాంగ్రెస్​

బాన్సువాడలో  పట్టు బిగిస్తున్న కాంగ్రెస్​
  • మాజీ స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి కోటకు బీటలు
  • మొన్నటిదాకా ఆయన వెంటే ఉన్న లీడర్లు హస్తంలోకి క్యూ
  • నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్​చార్జి ఏనుగు రవీందర్​రెడ్డి దూకుడు

వర్ని, వెలుగు: బీఆర్ఎస్ గవర్నమెంట్​లో ఫస్ట్​ టైమ్ ​వ్యవసాయ శాఖామంత్రిగా, రెండో టర్మ్​లో అసెంబ్లీ స్పీకర్​గా వ్యవహరించిన బాన్సువాడ పోచారం శ్రీనివాస్​రెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పట్టు కోల్పోతుంది. శ్రీనివాస్​రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో క్యాడర్​ క్రమంగా చేజారిపోతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పనిచేసిన లీడర్లు కాంగ్రెస్​లోకి క్యూ కడుతున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఏనుగు రవీందర్​రెడ్డి ఎల్లారెడ్డి టికెట్ ​ఆశించారు. ఆ స్థానాన్ని మదన్​మోహన్ కు కేటాయించడంతో ఏనుగు రవీందర్​రెడ్డికి పక్కనే ఉన్న బాన్సువాడ టికెట్​ఇచ్చారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టికెట్​కన్ఫర్మ్ ​కావడంతో ఆయనకు నియోజకవర్గంపై పట్టు దొరకలేదు. తాను గెలిచినా, ఓడినా నియోజకవర్గంలోనే ఉండి క్యాడర్​కు అండగా ఉంటానని కార్యకర్తల్లో భరోసా నింపారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఏనుగు ఓడినా, ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బాన్సువాడను అడ్డాగా చేసుకుంటే రాజకీయ భవిష్యత్ ​ఉంటుందని గ్రహించిన రవీందర్​రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. పోచారం ముఖ్య అనుచరులను కాంగ్రెస్​ గూటికి ఆకర్షిస్తున్నారు. పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నిల్చొనే అభ్యర్థికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ అందించేందుకు ప్లాన్​ చేస్తున్నారు.

చేజారుతున్న లీడర్లు​

పోచారం శ్రీనివాస్​రెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్న  కోటగిరి ఎంపీపీ దంపతులు మల్లేపల్లి సునీత, శ్రీనివాస్​రావు, కోటగిరి మాజీ ఎంపీపీ గంధపు పవన్, దోమల్​ ఏడ్గి మాజీ ఎంపీటీసీ అనంత విఠల్ ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. వర్ని ఎంపీపీ దంపతులు మేక శ్రీలక్ష్మి, వీర్రాజు చేరిక కూడా దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. వీరు శనివారం రాత్రి ఏనుగు రవీందర్​ను కలిసి పార్టీలో చేరికపై చర్చించారు. ఎమ్మెల్యే కుడిభుజంగా భావించే మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్ ​సైతం హస్తం వైపు చూస్తున్నట్లు సోషల్ ​మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇటీవల వర్ని మండలంలోని జాకోరా విండో చైర్మన్‌ ను కూడా కాంగ్రెస్​వశం చేసుకుంది. ‌బీఆర్‌‌ఎస్‌ కు చెందిన కృష్ణారెడ్డి చైర్మన్​గా ఉండగా మెజార్టీ డైరెక్టర్లను తమ వైపు తిప్పుకొని అవిశ్వాసం నెగ్గారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన దశరథ్​ విండో చైర్మన్​గా ఎన్నికయ్యారు. వీరే కాకుండా నియోజకవర్గంలోని కోటగిరి, వర్ని, బీర్కూర్‌‌, బాన్సువాడ, చందూరు మండలాలకు చెందిన పలువురు కీలక నేతలు, తాజా మాజీ సర్పంచులు ఏనుగు రవీందర్‌‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో  ‌చేరారు.

కాంగ్రెస్​ లీడర్లతో భేటీల వెనక ఆంతర్యం ఏమిటో?

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి చిన్నకొడుకు, డీసీసీబీ చైర్మన్‌‌ పోచారం భాస్కర్‌‌రెడ్డి ఇటీవల బీసీ సంక్షేమ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అదే సమయంలో పోచారం రెండో కొడుకు సురేందర్‌‌రెడ్డి సైతం హైదరాబాద్​లో కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి దీపాదాస్‌ ‌మున్షీతో, తర్వాత బోధన్‌ ‌ఎమ్మెల్యే సుదర్శన్‌‌రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్​ లీడర్లతో వీళ్ల భేటీలు నియోజకవర్గంలో బీఆర్ఎస్​ లీడర్లను అయోమయంలో పడేశాయి. క్యాజ్​వల్ గానే భేటీ అయ్యారా? లేదంటే మరేదైనా కారణాలున్నాయా? అని అనుమానిస్తున్నారు.