న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. పార్టీలోని 9 వేల మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) డెలిగేట్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 137 ఏండ్ల పార్టీ చరిత్రలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరగడం ఇది ఆరోసారి. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ బరిలో లేకపోవడం వల్ల 24 ఏండ్ల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. పార్టీ చీఫ్ పదవికి సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీపడుతున్నారు.
దేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కార్యాలయంలో, భారత్ జోడో యాత్ర క్యాంప్ లో కూడా పోలింగ్ కోసం ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ అక్కడే ఓటేస్తారని సమాచారం. సోమవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని పార్టీ ఎన్నికల అథారిటీ చైర్మన్ మిస్త్రి తెలిపారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ సోమవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటేస్తారని పార్టీ నేతలు తెలిపారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్క్వార్టర్స్కు తరలిస్తారు. ఈ నెల 19న కౌంటింగ్ చేపట్టి, ఫలితాలు ప్రకటిస్తారు.