ఇక్కడే డిక్లరేషన్.. ఇక్కడి నుంచే సమరభేరి..బీసీల సభకు భారీ ఏర్పాట్లు

ఇక్కడే డిక్లరేషన్.. ఇక్కడి నుంచే సమరభేరి..బీసీల సభకు భారీ ఏర్పాట్లు
  •     మూడు జిల్లాల నుంచి జన సమీకరణ
  •     ఏర్పాట్లు పరిశీలించిన పీసీసీ చీఫ్ , మంత్రులు

కామారెడ్డి, వెలుగు: బీసీ డిక్లరేషన్​ ప్రకటించిన కామారెడ్డి గడ్డ మీద నుంచే రిజర్వేషన్లకు అడ్డుగా ఉన్న బీజేపీ సర్కారు మీద సమర శంఖం పూరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. భారీ సభ నిర్వహించడం బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్​ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ పార్టీ కామారెడ్డి లో నిర్వహించిన సభలోనే బీసీ డిక్లరేషన్​ ప్రకటించింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని డిక్లరేషన్​లో హామీ ఇచ్చింది. దేశంలోనే ఎక్కడాలేని విధంగా బీసీ జన గణన చేసిన ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లులను అమోదించి గవర్నర్​కు పంపారు. ఈ బిల్లులు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్​లో ఉన్నాయి. 

ముస్లింల సాకుతో బీజేపీకి చెందిన లీడర్లు బీసీ బిల్లలును వ్యతిరేకిస్తుండడంపై కాంగ్రెస్​ ఇప్పటికే పోరాటాన్ని కొనసాగిస్తోంది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి బిల్లులకు చట్టబద్దత సాధించేందుకు పోరాటాన్ని ముమ్మరం చేయాలని పీసీసీ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 15న భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించింది. కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్​ ప్రకటించినందున సభ కూడా ఇక్కడే పెట్టాలని డిసైడ్​ అయ్యింది. 

 భారీగా జన సమీకరణ

 కామారెడ్డి సభకు కనీసం 2 లక్షల మందిని సమీకరించాలని పార్టీ నాయకులు టార్గెట్​గా పెట్టుకున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా జిల్లాల నుంచి ప్రధానంగా జనాన్ని తరలించాలని భావిస్తున్నారు. ఈ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో పీసీసీ లీడర్లు జనాలను తరలించే విషయంలో చర్చిస్తున్నారు. కామారెడ్డికి దగ్గరగా ఉండే మండలాలపై ఫోకస్​ పెట్టాలని సూచిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానుండడంతో గ్రామ, మండలస్థాయి లీడర్లు కూడా ఉత్సాహం పనిచేసే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్​ జాతీయ స్థాయి నాయకులు హాజరు కావచ్చునని తెలుస్తోంది.

 సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. సభ నిర్వహణ, జన సమీకరణ తదితర అంశాలను పరిశీలించేందుకు ఆదివారం కామారెడ్డిలో సన్నాహాక సమావేశం జరిగింది. సభ సక్సెస్​చేసేందుకు ఎలా పని చేయాలో పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్​, మంత్రులు దిశానిర్దేశం చేశారు. మీటింగ్​లో పీసీసీ చీఫ్​ మహేష్​కుమార్​గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పొన్నం ప్రభాకర్​, సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ షేట్కార్​, విప్​ ఆది శ్రీనివాస్​, ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, మదన్​మోహన్​రావు, భూపతిరెడ్డి, తోట లక్ష్మీకాంతరావు, పార్టీ ముఖ్య  నేతలు పాల్గొన్నారు.