- డెమొక్రటిక్ గవర్నర్ గ్రెషెన్ వైట్మర్కిడ్నాప్కు మిలిటెంట్ల ప్లాన్
- భగ్నం చేసి 13 మందిని అరెస్ట్ చేసిన ఎఫ్బీఐ అధికారులు
- ప్రెసిడెంట్ ట్రంప్, గవర్నర్ వైట్మర్ మధ్య మాటల యుద్ధం
వాషింగ్టన్: అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతున్న టైమ్ ఇది. ఇప్పటికే ప్రచారాలూ జోరుగా జరుగుతున్నాయి. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అపోజిషన్ డెమొక్రటిక్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జో బైడెన్ల మధ్య డిబేట్లూ మొదలయ్యాయి. ఇలాంటి టైంలో మిషిగన్ స్టేట్ గవర్నర్ గ్రెషెన్ వైట్మర్ కిడ్నాప్ కుట్ర కలకలం సృష్టించింది. బైడెన్ ఎలక్షన్ ప్రచారానికి ఆమె కో చైర్ పర్సన్ కూడా అవడంతో మరింత కలవరం రేగింది. ముందుగానే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు కిడ్నాప్ కుట్రను భగ్నం చేసి.. 13 మందిని అరెస్ట్ చేశారు. అయితే, కిడ్నాప్ కుట్రపై ప్రెసిడెంట్ ట్రంప్, మిషిగన్ గవర్నర్ మధ్య వాదోపవాదాలూ జరిగాయి.
పెద్ద కుట్రకే ప్లాన్ చేశారు
గవర్నర్ వైట్మర్ కిడ్నాప్కు కుట్ర పన్నింది ప్రభుత్వ వ్యతిరేక మిలిటెంట్ సంస్థ అయిన వోల్వరిన్ వాచ్మెన్ అని ఎఫ్బీఐ అధికారులు తేల్చారు. అయితే, నిజానికి ముందుగా వాళ్లు ప్లాన్ చేసింది గవర్నర్ కిడ్నాప్కు కాదట. అంతకన్నా పెద్ద కుట్రే చేశారట. 200 మందితో లాన్సింగ్లోని స్టేట్ క్యాపిటోల్ బిల్డింగ్పై ఎటాక్ చేసి అందులోని అందరినీ బందీ చేయాలని ప్లాన్ చేశారని అధికారులు చెప్పారు. అయితే, అది కుదిరేలా కనిపించకపోవడంతో వెకేషన్ హోమ్లో ఉన్న గవర్నర్ను కిడ్నాప్ చేసేందుకు కుట్ర పన్నారని చెప్పారు. వోల్వరిన్ వాచ్మెన్ గ్రూపులోని ఏడుగురు యాంటీ టెర్రరిజం చట్టాలను ఉల్లంఘించారని మిషిగన్ అటార్నీ జనరల్ డేనా నెస్సెల్ చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పౌర యుద్ధానికి తెరతీసేందుకు 2019 నవంబర్ నుంచే ఫేస్బుక్లో మెంబర్లను రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టిందన్నారు.
తీవ్రవాదానికి ట్రంప్ ప్రోత్సాహం: వైట్మర్
కిడ్నాప్ కుట్రకు సంబంధించి ట్రంప్పై ఫైర్ అయ్యారు వైట్మర్. రాజకీయ తీవ్రవాదాన్ని ట్రంప్ ప్రోత్సహిస్తున్నారని, పోయిన వారం జరిగిన డిబేట్లో ట్రంప్ వైఖరే అందుకు నిదర్శనమని అన్నారు. ఇటీవల జరిగిన ఫ్లాయిడ్ ఘటనను ఖండించాల్సిందిగా డిమాండ్ చేసినా.. అందుకు ఒప్పుకోకుండా దాడి చేసిన వాళ్లనే పొగిడారని గుర్తు చేశారు. ఇద్దరు లీడర్ల మధ్య చర్చ జరిగినప్పుడు ఆయన డొమెస్టిక్ టెర్రరిస్టులకు అనుకూలంగా మాట్లాడడం, వాళ్ల చర్యలు మంచివని చెప్పడం దారుణమన్నారు.
సాయం చేసినం..థ్యాంక్స్ చెప్పాలె: ట్రంప్
వైట్మర్ ఆరోపణలకు ట్రంప్ కూడా దీటుగా బదులిచ్చారు. గవర్నర్ పనితీరు చాలా దారుణంగా ఉందని, ఆమె పాలన అసలేం బాగాలేదని ఆమే చెప్పుకుంటున్నారని విమర్శించారు. మిషిగన్ గవర్నర్ కిడ్నాప్ కుట్రను భగ్నం చేసినట్టు తమ జస్టిస్ డిపార్ట్మెంట్ అండ్ ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారన్నారు. చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి తనను రేసిస్ట్ అని అవమానిస్తారా అని ప్రశ్నించారు.