కూకట్పల్లి, వెలుగు: రాష్ట్ర హౌసింగ్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంతో రూ.కోట్ల ఖర్చుతో మొదలుపెట్టిన 788 ఇండ్ల నిర్మాణం 15 ఏండ్లుగా పూర్తి కావడం లేదు. జాయింట్ వెంచర్లో భాగంగా ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ వీటిని పూర్తిచేయాల్సి ఉండగా చేయలేదు. నిర్మాణ సంస్థ తన భాగంలోని ఫ్లాట్లను అమ్మేసు కుని వీటిని గాలికొదిలేసింది. కేపీహెచ్బీ కాలనీ ఏడో ఫేజ్ నుంచి హఫీజ్పేటకు వెళ్లే దారిలో 75 ఎకరాల హౌసింగ్ బోర్డు భూమి ఉంది. ఉమ్మడి ఏపీలో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బోర్డు అధికారులు ఇక్కడ ‘ఇందు’ పేరుతో జాయింట్వెంచర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ తక్కువ ధరకు పనులను దక్కించు కుంది. 788 ఎల్ఐజీ(లోయర్ ఇన్కమ్ గ్రూప్) ఫ్లాట్లను జీ ప్లస్ 5 పద్ధతిలో నిర్మించి బోర్డుకి అప్పగించాలి.
మిగిలిన స్థలంలో సదరు ప్రైవేట్సంస్థ నిర్మాణాలు చేసి అమ్ముకోవచ్చు. ఒప్పందం ప్రకారం 15 ఏండ్ల క్రితమే ఒకేసారి ఎల్ఐజీ ఫ్లాట్ల నిర్మాణం, ప్రైవేటు సంస్థ విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం మొదలైంది. అయితే, కొన్నేండ్ల వ్యవధిలోనే సదరు కంపెనీ తన వాటాకు వచ్చిన భూమిలో విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తిచేసి అమ్మేసుకుంది. హౌసింగ్బోర్డుకి అప్పగించాల్సిన 788 ఫ్లాట్ల నిర్మాణాన్ని వదిలేసింది. ఇప్పటికీ వాటి నిర్మాణం పూర్తి కాలేదు. ఏండ్లుగా అలాగే ఉన్నా హౌసింగ్బోర్డు పట్టించుకోవడం లేదు. సదరు సంస్థ పూర్తిచేసి అధికారికంగా బోర్డుకి అప్పగించిన తర్వాతే జనాలకు కేటాయించే అవకాశం అధికారులకు ఉంటుంది. హైటెక్ సిటీకి, ఈ వెంచర్కు మధ్యలో రైల్వే ట్రాక్ మాత్రమే ఉంది. దీంతో ఇక్కడి ఫ్లాట్లకి విపరీతమైన డిమాండ్ ఉంది. బోర్డు కలగజేసుకుని సదరు సంస్థతో పూర్తిచేయిస్తే వేలల్లో అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది.