క్యారీ బాగ్ ఫ్రీ గా ఇవ్వనందుకు రూ.7 వేలు జరిమానా

క్యారీ బాగ్ ఫ్రీ గా ఇవ్వనందుకు రూ.7 వేలు జరిమానా

మనం ఏదైనా షాప్ కి వెళ్లి షాపింగ్ చేశాక బిల్లు కట్టే సమయంలో క్యారీ బాగ్ కావాలా.? అని అడుగుతారు షాప్ నిర్వాహకులు. అందుకు మనం కావాలనగానే ఆ బాగ్ కు కూడా ఖరీదు వేసి మొత్తం బిల్లును మన చేత పే చేయిస్తారు.

నగరంలోని ఉప్పల్ కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి  కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.  బేగంపేట్ లోని షాపర్స్ స్టాప్ లో షాపింగ్ చేసిన అతనికి  బిల్లు కట్టే సమయంలో క్యారీ బాగ్ తో కలిపి రూ. 5 ఎక్కువ బిల్లు వేశారు. మీ షాప్ లో కొన్న వస్తువులకు మీరే క్యారీ బాగ్ ఉచితంగా ఇవ్వాలని కదా అని అతను అడిగితే అందుకు వారి దగ్గరనుంచి ఎలాంటి సమాధానం లేదు. ఈ విషయంపై అతను తెలంగాణ రాష్ట్ర వినియోగ దారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

వారిద్దరి వాదనలు విన్న రాష్ట్ర వినియోగదారుల సమాచార వివాద పరిష్కార కేంద్రం… ఆ షాప్ కు రూ.7 వేల రూపాయల జరిమానా విధించింది. షాప్ లోగో ను ముద్రించి ఉండే క్యారీ బాగ్ ను ఉచితంగా ఇవ్వాలని, లోగో లేని సంచినే ఖరీదు కట్టి అమ్మాలని తెలిపింది. అతని ఫిర్యాదుతో ఏ షాప్ అయినా సరే తమ లోగో ఉన్న బాగ్ ను ఉచితంగా ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. లేదంటే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

షాప్ నిర్వాహకులతో ఎటువంటి వివాదం వచ్చినా… తమ ఆఫీస్ కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చని కన్జ్యూమర్స్ ఫోరం కమిషనర్ చెప్పారు. ఎర్రమంజిల్ లోని ఆఫీస్ కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిదినాల్లో 1800 425 00333 టోర్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చని సూచించారు.