- ఆసిఫాబాద్ కు డీఐఈఓ పోస్టు లేకున్నా ఆర్డర్
- డీపీసీ లేకుండానే ప్రిన్సిపల్ ప్రమోషన్!
హైదరాబాద్: విద్యాశాఖ ఇటీవల రిలీజ్ చేసిన ఓ జీవో ఇంటర్మీడియేట్ఎడ్యుకేషన్లో వివాదాస్పదంగా మారింది. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో లేని డీఐఈఓ పోస్టుకు ప్రిన్సిపల్కు బాధ్యతలు ఇవ్వగా.. డీపీసీ లేకుండానే ఓ లెక్చరర్కు ప్రిన్సిపల్ ప్రమోషన్ ఇచ్చారు. ఇటీవల విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ ఇచ్చిన జీవో నెంబర్ 150 తప్పులతడకగా మారింది. రాష్ట్రంలో11 జిల్లాలకు మాత్రమే డీఐఈఓ ( జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి)లు పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన చాలా జిల్లాలకు కాలేజీల పర్యవేక్షణకు సీనియర్ ప్రిన్సిపల్స్ ను నోడల్ ఆఫీసర్లను నియమించారు. అయితే, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు నోడల్ ఆఫీసర్ గా ఉన్న శ్రీధర్ సుమన్ను బదిలీ చేస్తూ, రెబ్బన సర్కారు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎన్శంకర్కు డీఐఈఓగా పోస్టింగ్ ఇస్తూ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు.
అయితే, ఆ జిల్లాకు డీఐఈఓ పోస్టు లేదు. ప్రస్తుతమున్న నోడల్ ఆఫీసర్ను ట్రాన్స్ ఫర్ ఎక్కడికి చేశారనేది ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. మరోపక్క కౌటాల జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ స్వరూపరాణిని బదిలీ చేశారు. ఆమె రెగ్యులర్ ప్రిన్సిపల్ కానీ, ఆమెను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నరనేది జీవోలో చెప్పలేదు. దీనికి ఆమె స్థానంలో డీపీసీ లేకుండా ఆ కాలేజీ లెక్చరర్ బాలకిషన్కు ప్రిన్సిపల్గా పోస్టింగ్ ఇచ్చారు. అయితే, ఉత్తర్వుల్లోసీనియర్ మోస్ట్ జూనియర్ లెక్చరర్ అని పేర్కొనాల్సిన చోట... సీనియర్ లెక్చరర్ అని పేర్కొన్నారు. వాస్తవానికి సీనియర్ లెక్చరర్ అంటే డిగ్రీ లెక్చరర్. ఇలా అనేక తప్పులతో జీవో రావడంపై ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్లో చర్చనీయాంశంగా మారింది.