
- హుండీలు ఓపెన్ చేసిన ఆలయ కమిటీ
- తమకు చెప్పకుండానే తెరిచారన్న ఎండోమెంట్ అధికారులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపుపై గందరగోళం నెలకొంది. ఏటా బోనాల సందర్భంగా ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లిస్తారు. ప్రత్యేక పూజలు చేసి కానుకలు సమర్పిస్తుంటారు. బోనాల ఉత్సవం ముగిసిన తర్వాత ఎండోమెంట్, ఆలయ కమిటీ సభ్యులు హుండీలు లెక్కించడం ఆనవాయితీగా వస్తున్నది. వచ్చిన కానుకలను ఎండోమెంట్ అకౌంట్ లో జమ చేస్తారు. ఈసారి ఆలయ కమిటీకి చెందిన కొందరు సభ్యులు హుండీలు ఓపెన్ చేశారు. దీంతో కొందరు భక్తులు కోర్టును ఆశ్రయించగా.. హుండీ లెక్కింపుపై ఈ నెల 17న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఎండోమెంట్ అధికారులు మంగళవారం హుండీలు సీజ్ చేశారు.
అప్పటికే ఆలయ కమిటీ సభ్యులు మూడు హుండీలు ఓపెన్ చేసి నిధులు తీసుకున్నారు. రూ.4.20 లక్షలు వచ్చాయని, ఆలయంలో ఏర్పాట్ల కోసం ఖర్చు చేశామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నట్లు ఎండోమెంట్ అధికారులు తెలిపారు. ఆలయంలో మొత్తం నాలుగు హుండీలు ఉన్నాయని, అందులో మూడు తెరిచారని పేర్కొన్నారు. మిగిలిన హుండీని సీజ్ చేశామన్నారు. బుధవారం ఆ హుండీ లెక్కిస్తామన్నారు. నిరుడు హుండీల ద్వారా రూ.11 లక్షల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. కాగా, తమకు తెలియకుండా హుండీ లెక్కింపు జరిగిందని ఎండోమెంట్ అధికారులు చెబుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.