
- ఈ నెలాఖరుకు లక్షన్నరకు చేరవచ్చని నిపుణుల అంచనా
- లాక్డౌన్ సడలించడంతో రోడ్లపైకి జనం.. వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం
- ఇప్పటివరకు 60% కేసులు గత 15 రోజుల్లోనే.. 3 రోజుల్లోనే 10 వేల మందికి
- ఇంకా అందుబాటులోకి రాని వ్యాక్సిన్.. ఎప్పుడొస్తదో తెలియని పరిస్థితి
- జూన్, జులైలో కేసులు భారీగా పెరుగుతయంటున్న ఎక్స్పర్ట్స్
- సెప్టెంబర్లో సెకెండ్ వేవ్ ఉండొచ్చని హెచ్చరికలు
న్యూఢిల్లీ:కరోనా తగ్గడం లేదు.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. 40 డిగ్రీలకు పైన నమోదవుతున్న ఎండలకు వైరస్ ట్రాన్స్మిషన్ తగ్గుతుందనుకుంటే.. మెల్లమెల్లగా పెరిగిపోతోంది. అంతా అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నా.. పరిస్థితి అంతకంతకూ ప్రమాదంగా మారిపోతోంది. గత వారం రోజులుగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మూడు రోజుల్లోనే 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అంటే సగటున రోజుకు 3 వేల మందికిపైగా వైరస్ బారిన పడుతున్నారు. ఇక చనిపోతున్న వారి సంఖ్య రోజూ వందకు పైనే ఉంటోంది. దేశంలో ఇంకా కరోనా పీక్ స్టేజ్కి చేరలేదని, జూన్, జులైలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని డబ్ల్యూహెచ్వోతోపాటు దేశంలోని మెడికల్ ఎక్స్పర్టులు చెబుతున్నారు.
పెరుగుతూనే ఉన్నది
దేశంలో రోజూ నమోదయ్యే కేసుల సంఖ్య ఏప్రిల్ 30 వరకు 2 వేల లోపే ఉండేది. మే 1 నుంచి రోజూ 2 వేలకు పైనే నమోదువుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా 3 వేలకు పైనే రికార్డవుతున్నాయి. మొత్తం కేసుల్లో 65 శాతానికి పైగా గత 15 రోజుల్లోనే నమోదయ్యాయి. పరిస్థితి ఇలానే కంటిన్యూ అయితే మే 15 నాటికి దేశంలో కేసుల సంఖ్య లక్ష దాటే ప్రమాదం ఉంది. ఆ తర్వాత 15 రోజుల్లోనే లక్షన్నరకు చేరొచ్చని ఎక్స్పర్టులు చెబుతున్నారు.
రోజుకు 100 మందిపైనే
కరోనా కేసులతోపాటు డెత్ల సంఖ్య కూడా రానురాను పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు రోజూ 50 లోపు ఉన్న మరణాలు ఉండేవి. ఇప్పుడు 100కు పైనే నమోదవుతున్నాయి. ఏప్రిల్ 8న చనిపోయిన వాళ్లు 20 మంది. అప్పటి నుంచి మెల్లగా మృతుల సంఖ్య పెరుగుతోంది. మే 3న ఏకంగా140 మంది చనిపోయారు. అప్పటి నుంచి రోజూ 100 మందికిపైనే రోజూ చనిపోతున్నారు. ఆరో తేదీ మాత్రం 91 మంది మృతిచెందారు. ఇప్పటిదాకా దేశంలో 2 వేల మందికి పైగా చనిపోయారు. మొత్తంగా 2,101 మంది మృతిచెందారు.
జనాలు తిరిగేస్తున్నరు
తొలి రెండు దశల్లో లాక్డౌన్స్ర్టిక్ట్గా అమలు చేయడంతో జనాలు ఇండ్లలోనే ఉండిపోయారు. ఇప్పుడు సడలింపులు ఇవ్వడంతో బయట తిరుగుతున్నారు. చాలా మంది అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. వాహనాల సంఖ్య కూడా పెరిగింది. చాలాచోట్ల ట్రాఫిక్ జాం అవుతున్న ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ అనే తేడా లేకుండా జనం పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారు. రెడ్ జోన్ల నుంచి ఆరెంజ్, గ్రీన్ జోన్లలోకి ఇష్టమున్నట్లు వెళ్తున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో షాపులు, మార్కెట్లు తెరవడంతో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక వైన్స్ ప్రారంభించడంతో చాలాచోట్ల వందలాది మంది లిక్కర్ కోసం క్యూకడుతున్నారు. ఇలాంటి చోట్ల సోషల్ డిస్టెన్స్ ఉండటం లేదు. పోలీసుల చెకింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది.
కరోనా ఆస్పత్రులు పెరగాలి
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పేషెంట్లకు మాత్రమే ట్రీట్మెంట్ అందించేందుకు ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న ఆస్పత్రుల సంఖ్యతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం చాలా కష్టం. మహారాష్ర్టలో ఓ ఆస్పత్రిలో కరోనాతో చనిపోయిన వారి డెడ్ బాడీల పక్కనే పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. టెస్టుల సంఖ్య పెరగాలి. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ పెరగాల్సి ఉంది. కొన్ని రాష్ర్టాలు తగినన్ని టెస్టులు చేయడం లేదు.
కరోనాతో కలిసి బతకాల్సిందేనా!
‘కరోనా మనో జీవితంలో భాగం కాబోతోంది.. దాంతో కలిసి బతకాల్సిందే’ అన్న మాట కొన్ని రోజులుగా వినిపిస్తోంది. కొన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇదే అంటున్నారు. జాగ్రత్తలు పాటించినప్పుడే వైరస్ వ్యాప్తి అదుపులో ఉంటుందని, లేకపోతే కరోనాతో కలిసి జీవించడమెలాగో నేర్చుకోవాలని హెల్త్ మినిస్ర్టీ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ కూడా కామెంట్ చేశారు. వ్యాక్సిన్ కనిపెట్టే వరకు.. మాస్క్, ఫిజికల్ డిస్టెన్సింగ్, శానిటైజింగ్ వంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని ఎక్స్పర్టులు చెబుతున్నారు.
దేశంలో ఈ రాష్ర్టాల్లోనే ఎక్కువ
దేశంలో కొన్ని రాష్ర్టాల్లో పరిస్థితి సమస్యాత్మకంగా ఉంది. మహారాష్ర్ట, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని రాష్ర్టాల్లో రోజూ 500 నుంచి వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ర్టలో డైలీ ఏకంగా 1000 పైనే రికార్డ్ అవుతున్నాయి. దేశంలోని మొత్తం కేసుల్లో 30 శాతం ఇక్కడే ఉన్నాయి. ప్రతి 3 కేసుల్లో ఒకటి మహారాష్ర్టలోనే నమోదవుతోంది. శనివారం నాటికి దేశంలో కేసుల సంఖ్య 62,808కి చేరింది. మహారాష్ర్టలో 20,228, గుజరాత్లో 7,797, తమిళనాడులో 6,535, రాజస్థాన్లో 3,708, మధ్యప్రదేశ్లో 3,457 కేసులు
నమోదయ్యాయి.
వ్యాక్సిన్ ఎప్పుడొస్తదో?
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వైరస్ పుట్టినిల్లు అయిన చైనా నుంచి.. తీవ్రంగా నష్టపోయిన అమెరికా, ఇటలీ వరకు చాలా దేశాలు మందు కోసం రీసెర్చ్లు, ప్రయోగాలు చేస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్ కూడా కొనసాగుతున్నాయి. ఇండియాలో కూడా పలు కంపెనీలు వ్యాక్సిన్ తయారీ పనిలో ఉన్నాయి. కానీ కరోనాకు విరుగుడు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి. ప్లాస్మా థెరపీ, హైడ్రాక్సీ క్లోరోక్విన్, యాంటీ బాడీలతో చాలాచోట్ల డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నా.. అదే సరైన చికిత్స కాదు. క్వోరోక్విన్ వల్ల ప్రాణాలకే ప్రమాదముందని ఎయిమ్స్ డాక్టర్లే చెబుతున్నారు. ప్లాస్మా థెరపీ ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని, ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా తగ్గుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం పేర్కొంది. కరోనా బాధితులకు ప్లాస్మా థెరపీ చట్టవ్యతిరేకం అని కూడా చెప్పింది.
సెకెండ్ వేవ్ ముప్పు
అమెరికా, యూరప్ దేశాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, మన దేశంలో ఎండలు ఎక్కువ కాబట్టి వైరస్ ప్రభావం ఉండకపోవచ్చని మొదట్లో చాలా మంది అంచనా వేశారు. కానీ ప్రస్తుతం 44 డిగ్రీలకు వరకు టెంపరేచర్ రికార్డ్ అవుతున్నా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. దీంతో జూన్, జులైలో పీక్కు వెళ్తాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఒకవేళ ఆగస్గులో తగ్గినా.. మళ్లీ సెప్టెంబర్ తర్వాత సెకెండ్ వేవ్ మొదలయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. త్వరలో వానాకాలం మొదలు కానుండటంతో మళ్లీ కరోనా దాడి జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పుడు వైరస్ను కంట్రోల్ చేయడం చాలా కష్టమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.