పోలీస్, మిలటరీకి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో ఆదేశాలు
కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో. అయితే లాక్ డౌన్ వల్ల తమకు ఆహారానికి ఇబ్బందులు ఏర్పడుతాయని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కొన్ని ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. దీంతో అధ్యక్షుడు ప్రజలు, అక్కడి వామపక్ష సంఘాలపై సీరియస్ అయ్యారు. ఎవరూ రోడ్లపైకి రావొద్దని, కరోనా వైరస్ వ్యాప్తి, పరిస్థితుల్లో సీరియస్ నెస్ అర్థం చేసుకోవాలని సూచించారు. కాదని ఎవరైనా రోడ్లపైకి వస్తే షూట్ చేసి చంపేయండంటూ పోలీసులు, మిటలరీకి ఆదేశాలు జారీ చేశారాయన. వీడియో సందేశం
ద్వారా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోనే క్వారంటైన్ లో ఉండకుండా రోడ్లపైకి వచ్చి ట్రబుల్ ఇచ్చినా లేదా తమ ప్రాణాలకు ఇబ్బంది జరుగుతుందని పోలీసులు, మిలటరీ భావించినా కాల్చి చంపేయొచ్చని చెప్పారు. వామ పక్ష సంఘాల నేతలు రోడ్లపైకి వస్తే వారిని కరోనా మహమ్మారి పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చే వరకు జైలులో పెడతామని హెచ్చరించారు.
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం అధ్యక్షుడికి తిరుగులేని అధికారాలను కట్టబెడుతూ ఆ దేశ చట్టసభలు చట్టం చేశాయి. అలాగే లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలు ఇబ్బంది లేకుండా నగదు పంపిణీ చేసేందుకు 20 వేల కోట్ల పెసోస్ (ఫిలిప్పీన్స్ కరెన్సీ) ప్రత్యేక నిధిని అందుబాటులోకి తెచ్చారు. ఈ నగదును కోటి 80 లక్షల మందికి పంపిణీ చేయాల్స ఉంది. అయితే లబ్ధిదారుల వివరాల సేకరణకు అలస్యమవుతుండడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో నిరసనల చేపడుతున్నారు ప్రజలు. అయితే ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బందిపడకుండా చూస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధ్యక్షుడు రోడ్రిగో చెప్పారు.
