కేరళలో ఇవాళ కూడా 45వేలు దాటిన కేసులు

కేరళలో ఇవాళ కూడా 45వేలు దాటిన కేసులు
  •  పాజిటివిటీ రేటు 44.8శాతం నమోదు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 45వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 45,136 కొత్త కేసులు నమోదైనట్లు కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.  కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 55 లక్షల 74వేల 702 చేరుకుంది. కరోనా పంజా విసురుతుండడంతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఇప్పుడు 44.8 శాతానికి పెరిగింది. 

2020లో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి గడచిన కొద్ది రోజులుగా రోజువారీగా అత్యధిక కేసులు నమోదు అవుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులతోపాటు.. వ్యాక్సినేషన్ ను కూడా ప్రభుత్వం పెంచుకుంటూ వెళుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,00735 మందికి పరీక్షలు చేయగా 45 వేల 136 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,47,227 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేరళ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 
మరో వైపు కరోనా సోకిన వారిలో  శనివారం 21,324 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 52,97,971 చేరుకుంది. అలాగే కేరళలో ఇవాళ 132 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 51,739 చేరుకుంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు ఆదివారాల్లో లాక్‌డౌన్ లాంటి కఠిన ఆంక్షలు అమలు చేయనుంది. 

 

ఇవి కూడా చదవండి

వనమా రాఘవేంద్రకు రిమాండ్‌ పొడిగింపు

ఫేక్ ఛానళ్లు, వెబ్సైట్లపై యూట్యూబ్ కొరడా

IAS, IPS అధికారులకు పదోన్నతి