కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 3న ముగుస్తున్న లాక్ డౌన్ మరో రెండు వారాలు కొనసాగిస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆంక్షలను సడలిస్తూ కొంత మేర ఆర్థిక కార్యకలాపాలకు అవకాశమిచ్చింది. జిల్లాల వారీగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి ఎక్కడెక్కడ ఏయే పనులు చేసుకోవచ్చు, ఎలాంటి సర్వీసులకు అనుమతి ఇస్తుందన్న వివరాలతో మార్గదర్శకాలను విడుదల చేసింది. రెడ్ జోన్ జిల్లాల్లోనూ కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ.. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్న కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రం ఎటువంటి సడలింపులు లేకుండా లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
అన్ని జోన్లలోనూ ఇవి క్లోజ్
దేశమంతా రైళ్లు, విమాన సర్వీసులు, మాల్స్, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా బంద్ చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. బార్బర్ షాపులు, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ కు ఏ జోన్ లోనూ అనుమతి లేదు. రాష్ట్రాల మధ్య ప్రయాణాలు చేయకూడదు. జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్ లు క్లోజ్ చేయాల్సిందే. అన్ని ప్రార్థన స్థలాలను మూసేయాలి. మతపరమైన సదస్సులు, సభలు పెట్టకూడదు. నాన్ ఎసెన్షియల్ సర్వీసులన్నీ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు తప్పనిసరిగా మూసేయాలి.
రెడ్ జోన్లలో కూడా ఈ సర్వీసులకు ఓకే
రెడ్ జోన్లలోనూ అత్యవసర, నిత్యవసర సర్వీసులను అనుమతిచ్చింది కేంద్రం. భవన నిర్మాణ పనులు చేపట్టొచ్చని చెప్పింది. వ్యవసాయ పనులు, ఉపాది హామీపనులు చేసుకోవచ్చు. అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సర్వీసులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు పనులు చేయవచ్చు. మీడియా, ఐటీ సర్వీసులు, కాల్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజీలు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులకు అనుమతి ఇచ్చింది కేంద్రం. నిత్యావసరాలు, అత్యవసర వస్తువుల సేల్స్ కు అనుమతి. వాటి తయారీకి వీలు. ఫార్మా, మెడికల్ డివైజ్ ల తయారీకి సంబంధించిన యూనిట్లు ఓపెన్. అలాగే వాటి సరఫరాకు సమస్య లేకుండా చూడాలని ఆదేశించింది. రెడ్ జోన్లలో ఆటోలు, క్యాబ్స్, బస్సులు తిరగడానికి లేదు. బైక్ లపై ఒక్కరు మాత్రమే వెళ్లాలి. సొంత కారు ఉంటే డ్రైవర్ తోపాటు మరో ఇద్దరు ప్రయాణించవచ్చు. ఈ-కామర్స్ సంస్థలు కేవలం నిత్యావసర వస్తువులు మాత్రమే డెలివరీ చేయాలి. రెడ్ జోన్లలోనూ 33 శాతం ఉద్యోగులతో ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు పని చేయొచ్చు. కంటైన్మెంట్ ఏరియాల్లో ఎటువంటి సడలింపులు ఉండవు. మరింత కఠినంగా పూర్తి లాక్ డౌన్ అమలవుతుంది.
ఆరెంజ్ జోన్ లో ఇలా..
– రెడ్ జోన్లలో ఇచ్చిన వెసులుబాట్లకు అదనంగా టాక్సీలు, క్యాబ్స్ కు ఆరెంజ్ జోన్లలో అనుమతి ఇచ్చింది కేంద్రం. అయితే క్యాబ్, టాక్సీల్లో డ్రైవర్ తో పాటు ఒక్కరు మాత్రమే ప్రయాణించే అవకాశం ఇచ్చింది.
– సొంత వాహనం ఉండే వాళ్లు ఇతర ఆరెంజ్, గ్రీన్ జోన్ జిల్లాలకు వెళ్లొచ్చు. అయితే ఉద్యోగాలకు లేదా మెడికల్ అవసరాలకు మాత్రమే ఈ ప్రయాణాలకు అనుమతి.
– కార్లలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మాత్రమే ఉండాలి. బైక్ లపై ఇద్దరు ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చింది కేంద్రం.
గ్రీన్ జోన్లలో ఇలా..
– జోన్లతో సంబంధం లేకుండా దేశమంతా నిషేధించిన కార్యకలాపాలు కాకుండా మిగతా పనులు, సేవలకు పర్మిషన్ ఇచ్చింది కేంద్రం.
– ప్రయాణాలకు ఆరెంజ్ జోన్లలో ఇచ్చిన సడలింపులకు అదనంగా గ్రీన్ జోన్లలో ఆర్టీసీ బస్సులు కూడా తిప్పేందుకు అనుమతిచ్చింది. అయితే బస్సుల్లో సీటింగ్ 50 శాతం మాత్రమే నింపాలని, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. అలాగే బస్సు డిపోల్లోనూ 50 శాతం కెపాసిటీతోనే ఆపరేట్ చేయాలని సూచించింది.