రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. శనివారం వరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 503కు చేరినట్లు చెప్పారు. అందులో 14 మంది మరణించగా.. 96 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రజలంతా లాక్ డౌన్ గట్టిగా పాటించాలని పిలుపునిచ్చారు. నిజాముద్దీన్ లాంటి గండం ఏదీ రాకూడదని కోరకుంటున్నానని, మన రాష్ట్రంలో ఈ నెలాఖరు కల్లా కొత్తగా కరోనా కేసులు రాకుండా అరికట్టాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 243 కరోనా కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని, జీహెచ్ఎంసీలోనే 123 జోన్లు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోవాలని అన్నారు సీఎం కేసీఆర్. కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలకు నిత్యావసరాలను డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. ఆ ఏరియాల్లో నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు.
ఏప్రిల్ 30 తర్వాత దశల వారీగా లాక్ డౌన్ ఎత్తేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. ఈ లోపు కూడా సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయం పనులు చేసుకోవచ్చని అన్నారు. అలాగే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, రైస్ మిల్స్, అయిల్ మిల్స్ లాంటివి నడిపిస్తామన్నారు.