
కరోనా వైరస్ మరోసారి తీవ్రంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO). ప్రపంచంలో ఇప్పుడు కరోనా అత్యంత క్లిష్టమైన దశలో ఉందని, కొన్ని దేశాలు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని WHO హెచ్చరించింది. ఉత్తారార్ధగోళంలో కరోనా వ్యాప్తి మరింత తీవ్రంగా విజృంభించే అవకాశాలు ఉన్నాయని WHO డైరెక్టర్ జనరల్ టెట్రోస్ అథనామ్ హెచ్చరించారు. కరోనా కారణంగా మరింత ప్రాణ నష్టం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైతే ఆరోగ్య సేవలు నిలిచిపోకుండా.. విద్యాసంస్థలు మళ్లీ మూసివేయాల్సిందిగా ఆయా దేశాల నేతలను కోరారు. వైరస్ కట్టడికి ఆయా దేశాలు విచక్షణాయుతంగా చర్యలు తీసుకోవాలని , మరోసారి గుర్తు చేస్తున్నానని అన్నారు. చాలా దేశాల్లో అంటు వ్యాధులు పెరిగే అవకాశాలున్నాయని, వైరస్ వ్యాప్తిని త్వరగా అరికట్టేందుకు ఆయా దేశాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి పాటిస్తే కరోనా నుంచి గట్టెక్కవచ్చన్నారు. కరోనా పరీక్షల పెరుగుదల, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ నిబంధనలను పాటించడంతో ఆయా దేశాలు గట్టెక్కవచ్చని టెట్రోస్ సూచించారు.