- 18 ఏండ్లలోపు పిల్లలపై జరిపిన స్టడీలో వెల్లడి
- వేరే రోగాలున్నోళ్లకు మాత్రం ప్రమాదమంటున్న సైంటిస్టులు
లండన్: చిన్నారులు, టీనేజర్లలో కరోనా లక్షణాలు తీవ్రమయ్యే ప్రమాదం చాలా తక్కువని సైంటిస్టులు చెప్పారు. వేరే రోగాలున్న వాళ్లలో మాత్రం పరిస్థితి తీవ్రం కావొచ్చని తెలిపారు. 18 ఏండ్లలోపు పిల్లలపై యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ యార్స్, యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ సైంటిస్టులు చేసిన మూడు స్టడీల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కరోనా మొదలైనప్పటి నుంచి 2021 ఫిబ్రవరి నాటికి కరోనా సోకిన 18 ఏండ్ల లోపు పిల్లల్లో 251 మంది ఐసీయూలో అడ్మిట్ అయ్యారని ఓ స్టడీ చెప్పింది. దీన్ని బట్టి ప్రతి 47,903 మంది పిల్లలో ఒకరికి కరోనా తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపింది. 18 ఏండ్ల లోపు వాళ్లలో 2021 ఫిబ్రవరి నాటికి 25 మంది కరోనాతో చనిపోయారని మరో స్టడీ వివరించింది. ప్రతి 10 లక్షల మంది పిల్లలు, టీనేజర్లలో ఇద్దరు వైరస్ సోకి చనిపోయే అవకాశం ఉందంది. అయితే డయాబెటిస్, ఆస్తమా, గుండె సంబంధిత రోగాలున్న వాళ్లకు కరోనా సోకితే ఐసీయూలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. ఒకటి కన్నా ఎక్కువ రోగాలున్న పిల్లల్లో కరోనా తీవ్రమయ్యే అవకాశం చాలా ఎక్కువుంటుందన్నారు. మొత్తంగా పిల్లల్లో కరోనా తీవ్రత, మరణాలు చాలా తక్కువని ఈ స్టడీల ద్వారా తెలుస్తోందని వివరించారు.
త్వరలో పిల్లలకు జైడస్ టీకా
పద్దెనిమిదేండ్లలోపు పిల్లల కోసం త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని నీతి అయోగ్ మెంబర్ వీకే పాల్ శుక్రవారం వెల్లడించారు. జైడస్ కాడిలా కంపెనీకి చెందిన జైకోవిడ్ త్రీ డోసెస్ వ్యాక్సిన్ పిల్లలకు కూడా ఇవ్వొచ్చని చెప్పారు. దేశవ్యాప్తంగా 12 నుంచి 18 ఏండ్ల వయసున్న పిల్లలు వెయ్యిమందిపై పరీక్షలు జరిపి, వ్యాక్సిన్ సేఫ్ అని కంపెనీ నిర్ణయించిందన్నారు. దీనికి సంబంధించిన డాటాతో ప్రస్తుతం జైడస్ కాడిలా సంస్థ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఏ)కు దరఖాస్తు చేసుకుందని వీకే పాల్ చెప్పారు. డీసీజీఏ అనుమతి రాగానే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.