న్యూఢిల్లీ: ఆర్టీపీసీఆర్ (ర్యాపిడ్) టెస్టుల్లో చాలా వరకు తప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయని, దాని దృష్టిలో పెట్టుకుని శవాలకు సంబంధించి టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా కూడా కరోనా సస్పెక్టెడ్ కేసుగానే లెక్కలోకి తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించింది. కాబట్టి కరోనా కాలం అయిపోయేంత వరకు శవాలను కోతల్లేకుండానే పోస్ట్మార్టమ్ చేయాలని సూచించింది. మెడికోలీగల్ అటాప్సీకి సంబంధించి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ విడుదల చేసింది. శవాలపై కరోనా వైరస్ బతకతదని చెప్పింది. టైం పెరిగేకొద్దీ శవాలపై దాని మనుగడ క్షీణించిపోతుందని పేర్కొంది. అయితే అది శవాలపై ఎంతసేపు బతుకుతుందన్నది మాత్రం చెప్పలేమని, దానికి ఇప్పటిదాకా సైంటిఫిక్ ఆధారాలేవీ లేవని వెల్లడించింది.
సెపరేట్ సిబ్బంది ఉండాల్సిందే
శవాలను వేరే ప్రాంతాలకు తరలించేందుకు మార్చురీల్లో ప్రత్యేకమైన సిబ్బంది ఉండాల్సిందేనని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఒకవేళ మార్చురీలో స్టాఫ్ తక్కువగా ఉంటే వెంటనే అవసరమైనంత మేరకు సిబ్బందిని నియమించుకోవాలని సూచించింది. ఆ నియామకాలకు అవసరమైతే స్వచ్ఛంద సంస్థలు, సంక్షేమ శాఖ సాయం తీసుకోవాలని చెప్పింది. శవాల అవయవాల నుంచి విడుదలయ్యే ఏరోసాల్స్ నుంచి కూడా కరోనా సోకుతుందనడానికి ఆధారాలున్నాయని చెప్పింది. మృతదేహాల నోరు, ముక్కు నుంచి కూడా ద్రవాలు విడుదలవుతుంటాయని, దాని వల్ల కరోనా సోకే ముప్పు కూడా ఎక్కువేనని చెప్పింది. కాబట్టి కేవలం సర్ఫేస్లను డిసిన్ఫెక్టెంట్లతో క్లీన్ చేసినంత మాత్రాన సరిపోదని, కరోనా వ్యాప్తిని అవి ఆపలేవని చెప్పింది. డబుల్ బ్యాగుల్లో శవాలను పెట్టడం, పోస్ట్మార్టం చేసేటప్పుడు ఒంటి నిండా సరైన పీపీఈలను వేసుకోవడం వల్ల డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి కరోనా సోకకుండా చూడొచ్చని చెప్పింది. కోతల్లేకుండానే శవాలకు పోస్ట్మార్టం చేయాలని ఐసీఎంఆర్ సూచించింది.
ఫొటోలు.. మాటలతోనే పోస్ట్మార్టం
శవాలపై కోతల్లేకుండానే పోస్ట్మార్టం చేయాలని సూచించిన ఐసీఎంఆర్.. డబ్ల్యూహెచ్వో సూచనల మేరకు ఫొటోలు, మాటలతోనే పోస్ట్మార్టం చేయాలని చెప్పింది. శవంలోని ఫ్లుయిడ్స్ పోస్ట్మార్టం చేస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బందిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. కరోనా టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉంటే ఆ రిపోర్ట్ వచ్చేదాకా శవాన్ని మార్చురీలోనే ఉంచాలని సూచించింది. ఆ తర్వాతే జిల్లా అధికారులకు ఇవ్వాలని చెప్పింది. శవాన్ని బ్యాగులో చుట్టేయాలని, అంతిమ సంస్కారాలకు ఎట్టిపరిస్థితుల్లో ఇద్దరిని మాత్రమే అనుమతించాలని పేర్కొంది. ఆ వచ్చిన ఇద్దరు శవానికి కనీసం ఒక మీటర్ దూరం ఉండాలని, బ్యాగును ఓపెన్ చేయకుండానే చనిపోయిన వ్యక్తిని చూడాలని సూచించింది. పోలీసుల సమక్షంలోనే అంతిమ సంస్కారాలు చేయాలని పేర్కొంది. ఆచారాల పేరిట శవాన్ని ముట్టుకోవద్దని, శవానికి స్నానం చేయించడం లాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లో చేయించొద్దని పేర్కొంది. శవాన్ని పూడిస్తే ఆ ప్రాంతం వరకు సిమెంట్తో ఫ్లోరింగ్ చేయాలని పేర్కొంది. ఒకవేళ కాల్చేస్తే ఆ మిగిలిన అస్థికలతో ఎలాంటి ప్రమాదం లేదనుకుంటేనే బంధువులకు ఇవ్వాలని చెప్పింది.
డాక్టర్, పోలీస్ సర్టిఫికెట్ ఉంటేనే…
కరోనాతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆస్పత్రిలో ఓ వ్యక్తి చనిపోయిన సందర్భాలకు సంబంధించి కూడా ఐసీఎంఆర్ సూచలను చేసింది. అది మెడికో లీగల్ కేసు కాకుంటే పోస్ట్మార్టం రద్దుకు ఆ పేషెంట్ను ట్రీట్ చేసిన డాక్టర్ సర్టిఫికెట్ అవసరమని చెప్పింది. ఒకవేళ ఆస్పత్రిలో కాకుండా బయట చనిపోయి ఉంటే డాక్టర్లు దానిని మెడికో లీగల్ కేసుగా లెక్కలోకి తీసుకోవాలని సూచించింది. అలాంటి శవాన్ని వెంటనే మార్చురీకి పంపించి, పోలీసులకు సమాచారమివ్వాలని సూచించింది. ఆ వ్యక్తి మరణానికి కారణమేంటో తెలుసుకోవడం కోసం పోస్ట్మార్టం చేయడానికి పోలీసుల సాయం తీసుకోవాలని చెప్పింది. ఇలాంటి కేసుల్లో ఫోరెన్సిక్ పోస్ట్మార్టం వద్దనుకుంటే పోలీసుల నుంచి సర్టిఫికెట్ తప్పనిసరి అని పేర్కొంది. హత్య, ఆత్మహత్య లేదా యాక్సిడెంట్కు గురైన వ్యక్తి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయి.. ఆ తర్వాత కరోనా కన్ఫర్మ్ లేదా సస్పెక్టెడ్ కేసైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ ఫోరెన్సిక్ అటాప్సీకి పంపించాలని పేర్కొంది. మెడికో లీగల్ కేసు అయినా ఎలాంటి క్రైమ్ లేదని తేలితే పోలీస్ అధికారి నిర్ణయం మేరకు పోస్ట్మార్టంను రద్దు చేయొచ్చని సూచించింది.