హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని మరో 8 జిల్లాల్లో కరోనా టెస్టింగ్ సెంటర్లను ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. టీబీ టెస్టులు చేసే సీబీనాట్(క్యాట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్ట్) పరికరాలతో కరోనా టెస్టులు చేయనుంది. ఆ పరికరాల్లో కొన్ని మార్పులు చేసి కరోనా టెస్టులు చేసుకోవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇప్పటికే గైడ్లైన్స్ ఇచ్చింది. అందుకు అవసరమైన వస్తువులనూ కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే టెస్టుల అనుమతి కోసం ఐసీఎంఆర్కు రాష్ట్ర ఆరోగ్య శాఖ దరఖాస్తు చేసింది. రాష్ర్టంలో 30 సీబీ నాట్ టెస్టింగ్ సెంటర్లున్నాయి. తొలి దశలో ఇందులోని 9 సెంటర్లను కరోనా టెస్టింగ్ సెంటర్లుగా మార్చాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్లో కరోనా టెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చెస్ట్ హాస్పిటల్లో టీబీ టెస్టింగ్ సెంటర్ ఉంది. దాంతో పాటు టీబీ టెస్టింగ్ సెంటర్లున్న ఆదిలాబాద్, గద్వాల్, కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్, నిజామాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ కరోనా టెస్టులు చేసేందుకు సర్కార్ రెడీ అవుతోంది.
గంటకు 4 నుంచి 16 టెస్టులు
ప్రస్తుతం బయో సేఫ్టీ లెవల్ 3 ల్యాబుల్లోనే కరోనా టెస్టులు చేసేందకు ఐసీఎంఆర్ అనుమతిస్తోంది. అందుకు తగ్గట్టు ఇప్పటికే ఆదిలాబాద్, చెస్ట్ హాస్పిటల్(ఐఆర్ఎల్) సెంటర్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో ఆ సెంటర్లకు అనుమతి వచ్చే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మిగిలిన 7 సెంటర్లకు మరో 15 రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే సీబీనాట్తో టెస్టులు చేస్తారు. అందులో పాజిటివ్గా తేలితే కరోనా కేసుగా తేలుస్తారు. ర్యాపిడ్ టెస్ట్లో లాగా మరోసారి చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గంటకు 4 శాంపిళ్లను మాత్రమే టెస్ట్ చేసేందుకు వీలుంది. అవసరాన్ని బట్టి 3 షిఫ్టుల్లో 18 గంటల పాటు పనిచేస్తే 72 శాంపిళ్లను ఒక్క రోజులో టెస్ట్ చేయొచ్చు. అందుకే గంటకు 16 టెస్టులు చేసే 4 పరికరాలను తెప్పిస్తున్నారు. మామూలుగా అయితే ఇప్పుడు రోజూ 1,570 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. సీబీ నాట్ అందుబాటులోకి వస్తే మరో 1,112 టెస్టులు చేయొచ్చు. మొత్తంగా 2,682 టెస్టులు చేయొచ్చు. అవసరాన్ని బట్టి వికారాబాద్ సహా మరికొన్ని జిల్లాల్లోనూ టెస్టింగ్ సెంటర్లను పెట్టేందుకు సర్కార్ ఆలోచిస్తోంది.