నేటి నుంచి ఇంటింటికి వ్యాక్సిన్

నేటి నుంచి ఇంటింటికి వ్యాక్సిన్
  • ఇంటికొచ్చి టీకా వేస్తరు
  • గ్రేటర్ హైదరాబాద్‌లో ఇయ్యాల్టి నుంచి స్పెషల్​డ్రైవ్
  • 200 మొబైల్ వాహనాలతో 10 రోజులపాటు ప్రోగ్రామ్

హైదరాబాద్, వెలుగు: ఇంటింటికీ వెళ్లి కరోనా వ్యాక్సిన్​ వేసేందుకు జీహెచ్‌ఎంసీ స్పెషల్ ​డ్రైవ్ ​చేపట్టింది. సోమ వారం నుంచి పది రోజుల పాటు ఈ ప్రోగ్రామ్‌ను వైద్య ఆరోగ్య శాఖ, కంటోన్మెంట్ బోర్డుతో కలిసి నిర్వహించనుంది. గ్రేటర్​లోని 4,846 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్​లోని 360 వాడలు, కాలనీల్లో ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటికే సిటీలో 70 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగిలిన వాళ్లకు వేసేందుకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లనున్నారు. దాదాపు 200 స్పెషల్ ​మొబైల్ ​కొవిడ్ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతుంది.

సిటీలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు బల్దియా ఈ డ్రైవ్ చేపట్టింది. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ సిబ్బంది, ఆశ, అంగన్ వాడీ, ఎంటమాలజీ టీమ్స్.. ముందుగా కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి టీకా వేసుకోని వారి జాబితాలు సేకరించాలని అధికారులు ఆదేశాలిచ్చారు. ఇంటింటికీ వెళ్లి మొబైల్ వ్యాక్సిన్ సెంటర్ల షెడ్యూల్ పాంప్లెట్స్ ​పంపిణీ చేస్తారు. వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఆయా కాలనీలు, బస్తీలు 100% వ్యాక్సినేటెడ్ అని బ్యానర్ ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు. ఆయా కాలనీ సంఘాలకు బల్దియా ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేస్తుందన్నారు. ఈ డ్రైవ్​ను బల్దియా ఉన్నతాధికారులతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు కూడా పర్యవేక్షిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్విలు ఆకస్మిక తనిఖీ చేస్తారు.