- చేయి’ జారిన చెన్నూరు.. సీనియర్ లీడర్పై ఆరోపణలు
- సీపీఐకి చెన్నూరు సీటు కేటాయిస్తే ఎవరిదారి వారు చూసుకుంటామని టికెట్ రేసులో ఉన్న లీడర్ల హెచ్చరిక
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్లో కోవర్టురాజకీయాలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ లీడర్ మిగిలిన రెండు సెగ్మెంట్ల నుంచి తన అనుచరులను బరిలోకి దించాలని అన్ని ప్రయత్నాలు చేశారు. ఆయన లక్ష్యం నెరవేరకపోవడంతో తన వాళ్లకు దక్కనివి వేరే ఎవరికీ దక్కరాదన్నట్టు వ్యవహరిస్తున్నారని మిగిలిన నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఫస్ట్ లిస్టులో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.
మంచిర్యాల నుంచి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, బెల్లంపల్లి నుంచి మాజీ మంత్రి గడ్డం వినోద్ పేర్లను ఖరారు చేసింది. లెఫ్ట్ పార్టీలతో పొత్తులో భాగంగా చెన్నూరుకు అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్లో పెట్టింది. వాస్తవానికి సీపీఐ బెల్లంపల్లిని అడిగితే చెన్నూరుకేటాయించేలా ఆ సీనియర్ లీడరే చక్రం తిప్పారని సొంత పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు చర్చించుకుంటున్నారు.
బెల్లంపల్లిలో పీఎస్ఆర్ గ్రూపు సపరేటు
కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి గడ్డం వినోద్ను ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు (పీఎస్ఆర్) అనుచరులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మొదటి నుంచి వినోద్ను వ్యతిరేకిస్తున్న పీఎస్ఆర్.. బెల్లంపల్లిలో తన అనుచరులను ప్రోత్సహిస్తున్నారు. వారిలో ఒకరికి టికెట్ ఇప్పించి బరిలోకి దించాలనుకున్నారు. బెల్లంపల్లి టికెట్ కోసం పోటీపడ్డ పీఎస్ఆర్ అనుచరులు ప్రస్తుతం వినోద్కు దూరంగా ఉంటున్నారు.
వారిలో ఇటీవలే పార్టీలో చేరిన న్యాతరి స్వామి, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కాంపెల్లి ఉదయ్కాంత్, టీపీసీసీ మెంబర్ చిలుముల శంకర్, మహిళా విభాగం రాష్ర్ట కార్యదర్శులు రొడ్డ శారద, చొప్పదండి దుర్గాభవాని, డీసీసీ జనరల్ సెక్రటరీ గెల్లి జయరాం యాదవ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడిమడుగుల మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎండీ అఫ్జల్, ఓబీసీ సెల్ స్టేట్ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ఉన్నారు. వారిలో చిలుముల శంకర్ గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పార్టీ కట్టుబాట్లను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని వినోద్ మద్దతుదారులు హెచ్చరిస్తున్నారు.
చెన్నూరు ‘చేయి’ జారినట్టేనా?
చెన్నూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుతో విసిగిపోయిన ప్రజలు.. కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. కానీ ఈ అవకాశాన్ని కాంగ్రెస్ చేజార్చుకున్నట్టే కనిపిస్తోంది. చెన్నూరు టికెట్ కోసం కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, డాక్టర్ రాజారమేశ్, పీఎస్ఆర్ అనుచరుడు నూకల రమేశ్ తదితరులు పోటీపడ్డారు. కానీ జిల్లాకు చెందిన ఓ సీనియర్ లీడర్ ఈ సీటును సీపీఐకి కేటాయించేలా చక్రం తిప్పారని పలువురు ఆరోపిస్తున్నారు. తాము బెల్లంపల్లి అడిగితే చెన్నూరుసీటు కేటాయించడంపై సీపీఐ లీడర్లే అవాక్కయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ లీడర్కు, బాల్క సుమన్కు ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లే చెన్నూరును సీపీఐకి కేటాయించేలా వేసిన ప్లాన్ వర్కవుట్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ సెకండ్ లిస్టులోనూ చెన్నూరుపై క్లారిటీ రాకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. ఆ సీటును సీపీఐకి కేటాయిస్తే ఎవరిదారి వారు చూసుకుంటామని టికెట్ రేసులో ఉన్న లీడర్లు పేర్కొంటున్నారు.