
బెంగళూరు: కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా దేశ జనాభాలో మూడింట రెండొంతుల(67 శాతం) మంది ఉపాధి కోల్పోతారని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ సర్వే వెల్లడించింది. దీని ప్రభావం ఎక్కువగా అర్బన్ ఇండియాపైనే ఉంటుందని పేర్కొంది. ఈ సంక్షోభ సమయంలో ఎక్కువగా ప్రభావితమయ్యే వారికి మరికొన్ని రిలీఫ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పీడీఎస్ ద్వారా అందజేస్తున్న సరుకులను మరో 6 నెలలు పొడిగించాలని, క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద నెలకు రూ.7 వేల చొప్పున 2 నెలలు ఇవ్వాలని సూచించింది. పది సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లతో కలసి అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఈ సర్వే చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర(పూణె), ఒడిశా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్లో దాదాపు 4 వేల మంది వర్కర్ల నుంచి ఫోన్ ద్వారా అభిప్రాయాలు సేకరించింది. లాక్డౌన్ వల్ల ఉపాధి, జీవనాధారం, గవర్నమెంట్ రిలీఫ్ స్కీమ్ల అందుబాటు తదితర అంశాలపై ఈ సర్వే చేసింది.
పాలసీల్లో మార్పులు అవసరం
ప్రస్తుత పరిస్థితుల కారణంగా పాలసీల్లో మరిన్ని మార్పులు చేయాలని, మీడియం, లాంగ్ టర్మ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు ఉండాలని, దీని ద్వారా ఎకానమీని మళ్లీ గాడిలో పెట్టొచ్చని ఈ సర్వే టీమ్సూచించింది. ఇందుకుగానూ తమ సర్వేలో గుర్తించిన విషయాలు ఉపయోగపడతాయని పేర్కొం ది. ఎకానమీ రికవర్ కావడానికి చాలా సమయం పడుతుందని పేర్కొంది. ప్రభుత్వాల రిలీజ్ చర్యలు కింది స్థాయిలో అవసరాలకు సరిపోవడం లేదని తెలిపింది. పెద్దఎత్తున నగదు బదిలీలతో ఎకానమీలో డిమాండ్ను తిరిగి తీసుకురావొచ్చని సూచించింది.
పడిపోయిన ఆదాయం
అర్బన్ ఏరియాల్లో 80 శాతం, రూరల్ ఏరియాల్లో 57 శాతం ఉపాధి కోల్పోతారని సర్వే స్పష్టం చేసింది. సెల్ఫ్ ఎంప్లాయ్డ్ వర్కర్ల ప్రస్తుతం పని చేస్తున్న వారి సగటు వారం సంపాదన రూ.2,240 నుంచి రూ.218(రూ.90 శాతం)కి పడిపోయింది. సాధారణ కార్మికుల్లో సగటు వారం సంపాదన ఫిబ్రవరిలో రూ.940 ఉంటే లాక్ డౌన్ టైమ్లో రూ.495కి పడిపోయింది. మొత్తం శాలరీ వర్కర్లలో 51 శాతం మంది తక్కువ శాలరీ లేదా అసలు శాలరీనే తీసుకోలేదు. 49 శాతం కుటుంబాల దగ్గర నిత్యావసరాల కొనుగోలు కు కూడా డబ్బుల్లేవని ఈ సర్వే తెలిపింది.