
భారత్ లో కరోనా వైరస్ సోకి రికవరీ అయిన వారి సంఖ్య 25శాతానికి పెరిగిందని తెలిపింది కేంద్రం. గత 14రోజుల నుంచి వృద్ధి రేటు నమోదైందని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చెప్పింది. ఇప్పటి వరకు 8వేల 324 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. గురువారం దేశ వ్యాప్తంగా 1,718 కేసులు కొత్తగా నమోదైనట్లు చెప్పారు. మొత్తం కలిపి ఇప్పటివరకు… 33వేల కేసులు నమోదు కాగా… ఒక వెయ్యి 74మంది మృతి చెందినట్లు చెప్పారు. దేశంలో కోవిడ్ మరణాల రేటు 3.2 శాతంగా ఉందని పురుషులు 65శాతం, స్త్రీలు 35శాతం ఉన్నట్లు చెప్పారు.
ఢిల్లీ, యూపీ, జమ్మూ కశ్మీర్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్లో 11నుంచి 20 రోజుల మధ్య కోవిడ్-19 కేసులు రెట్టింపు నమోదైతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. మార్చి 25నుంచి కొనసాగుతున్న దేశ వ్యాప్త లాక్ డౌన్…. వైరస్ను నిరోదించగలిగిందని అన్నారు.
దేశ వ్యాప్తంగా వచ్చిన రిపోర్ట్ల ప్రకారం వైరస్ వ్యాప్తి తగ్గిందని కేసులు తక్కువగా నమోదవుతున్నాయని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అమితాబ్ కాంత్ చెప్పారు. లాక్ డౌన్ ను మే3 తరువాత పొడిగించాలా వద్దా అనే విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే నిర్ణయిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. రెడ్ జోన్ లలో ఆంక్షలు అలాగే ఉండవచ్చని… గ్రీన్ జోన్లకు మాత్రం లాక్ డౌన్ సడలించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.