జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కే మద్దతు..సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి ప్రకటన

జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కే మద్దతు..సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి ప్రకటన

గోదావరిఖని, వెలుగు: జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​కు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నదని.. అదానీ, అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను జేబు సంస్థలుగా మారుస్తున్నదని దుయ్యబట్టారు.

 ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వాలు అణగదొక్కుతున్నాయని, ఆపరేషన్ కగార్​ పేరుతో మావోయిస్టులను అంతం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఆయన డిమాండ్​ చేశారు. సీపీఐ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా జోడే ఘాట్ నుంచి జీపు​జాత ప్రారంభమవుతుందని .. ఈ నెల 16న గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాలకు వస్తుందన్నారు. డిసెంబర్​ 26న ఐదు లక్షలమందితో ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన వెంకట్ రెడ్డి కోరారు. ఈ మీటింగ్​లో సీపీఐ లీడర్లు పాల్గొన్నారు.