- ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయంపై కూనంనేని హర్షం
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం ప్రభుత్వంపై ప్రజలు చూపుతున్న విశ్వాసానికి నిదర్శనమని, దీంతో రాష్ట్ర సర్కార్ మరింత బాధ్యతగా హామీల అమలుపై దృష్టి సారించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం పట్ల శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తం చేస్తూ అభ్యర్థి నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతు తెలపడంతో పాటు ప్రచారం చేసిందని గుర్తుచేశారు.
విజ్ఞతతో ఓటు వేసిన ఓటర్లకు ఆయన అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు అవడం.. తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్ర వైఖరికి నిదర్శనమన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోవడంతో ఓటమి పాలయ్యిందన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన విజయం ఆ కూటమిది కాదని, ఎన్నికల సంఘానిదేనని ఆరోపించారు.
