- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఫైర్
వనపర్తి, వెలుగు : పాలమూరు- – -రంగారెడ్డి ప్రాజెక్టు కోసం పదేండ్లలో రూ.74 వేల కోట్లలో కేవలం రూ.32 వేల కోట్లు ఖర్చు చేసి 90% పనులు పూర్తి చేశామని మాజీ సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే ఈ ప్రాజెక్టుకు పెద్దపీట వేశామని కాంగ్రెస్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఈ ప్రాజెక్టు విషయంలో ఇరు పార్టీలు దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయని విమర్శించారు. పెద్దపీట వేస్తే ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. శనివారం వనపర్తిలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో జాన్ వెస్లీ మాట్లాడారు.
ఉమ్మడి పాలమూరు బీడు భూములకు సాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అశాస్త్రీయ పద్ధతిలో మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. పారదర్శకతతో పనులు పూర్తి చేయకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రధాన డిస్ట్రిబ్యూటర్లు, చిన్న కాలువలు మొదలే కాలేదని, ప్రధాన కాలువలే పూర్తి చేయకుండా బీళ్లకు నీళ్లు ఎలా పారుతాయని ప్రశ్నించారు.
