- ఒకే వేదికపై 100 కి పైగా రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్లు
- ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం : క్రెడాయ్
హైదరాబాద్, వెలుగు: క్రెడాయ్ హైదరాబాద్ తన ప్రాపర్టీ షో 13 వ ఎడిషన్ను శుక్రవారం ప్రారంభించింది. ఈ నెల 8 నుంచి 10 మధ్య హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. రాష్ట్ర రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించారు. సిటీలోని రెరా రిజిస్ట్రేషన్ పొందిన 100 కి పైగా ప్రాజెక్ట్లను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. ఇల్లు కొనుక్కోవాలనుకునే వారి కోసం టాప్ ప్రాజెక్టులను ఒక వేదికపైకి తీసుకొచ్చామని, ప్రాజెక్ట్లను చాలా జాగ్రత్తగా ఎన్నుకున్నామని క్రెడాయ్ చెబుతోంది.
ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి.రాజశేఖర్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ ఎన్ జైదీప్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ జగన్నాథ్ రావు తదితర సీనియర్ మేనేజ్మెంట్ పాల్గొన్నారు. డెవలపర్లు, మెటీరియల్స్ను అమ్మే కంపెనీలు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ ప్రొడక్ట్లను ప్రాపర్టీ షోలో ప్రదర్శనకు ఉంచాయి. విల్లాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ స్పేస్ వంటి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలను డెవపలర్లు ప్రదర్శనకు ఉంచారు. వీటికి రెరా రిజిస్ట్రేషన్ ఉందని, కొనుగోలుదారులు భయపడాల్సిన పనిలేదని క్రెడాయ్ చెబుతోంది. కొనుగోలుదారులు తమకు నచ్చిన ప్రాపర్టీల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చని పేర్కొంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో తమ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్లను ప్రదర్శించడానికి అవకాశం దక్కిందని డెవలపర్లు, మెటీరియల్స్ వెండర్లు పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ సెక్టార్ జూమ్
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సెక్టార్ స్ట్రాంగ్గా ఉందని, రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్ విభాగాల్లో వృద్ధి నమోదు చేస్తోందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. కిందటి నెలలో రిజిస్టరైన ప్రాపర్టీలు 21 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగాయని, వీటి విలువ 42 శాతం పెరిగిందని అన్నారు. ఈ నెంబర్లు చూస్తే రియల్ ఎస్టేట్ సెక్టార్ బలంగా ఉందనే విషయం క్లియర్గా అర్థమవుతోందని చెప్పారు. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉండే ప్రాపర్టీలతో పాటు ప్రీమియం ఇండ్లకు మంచి డిమాండ్ కనిపిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రియల్ ఎస్టేట్ సెక్టార్ దూసుకుపోతుందని పేర్కొన్నారు. సీఎం ప్రకటించిన మెగా మాస్టర్ ప్లాన్ 2050 చూస్తే సిటీ మరింతగా డెవలప్ అవుతుందని అర్థమవుతోందన్నారు.
‘ ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను, 30 మునిసిపాలిటీలను హెచ్ఎండీఏలో విలీనం చేస్తే సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింతగా డెవలప్ అవుతుంది. వృద్ధి చెందుతుంది. ‘మూసీ కారిడార్’ తో హైదరాబాద్ మరింత మంది టూరిస్టులను ఆకర్షిస్తుంది’ అని రాజశేఖర్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్, జేబీఎస్ రూట్లో ట్రాఫిక్ తగ్గించేందుకు రెండు కారిడార్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుందని, ఇందుకోసం డిఫెన్స్ మినిస్ట్రీ అప్రూవల్స్ పొందడంలో విజయం సాధించిందని చెప్పారు. దీంతో ఈ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా డెవలప్ అవుతుందని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్లో ప్రాపర్టీల ధరలు పెరుగుతున్నాయని, ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయని చెప్పారు. ప్రాపర్టీ షోలో తమకు నచ్చిన ప్రాపర్టీని కొనుక్కోవాలని ప్రజలకు సూచించారు. రానున్న రెండేళ్లలో సిటీలో 35–38 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో బిజినెస్ పార్కులు వస్తున్నాయని, ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జైదీప్ రెడ్డి అన్నారు. రెరా రిజిస్ట్రేషన్ ఉన్న టాప్ ప్రాపర్టీలను కొనుక్కునేందుకు క్రెడాయ్ ప్రాపర్టీ షో గొప్ప వేదికని అన్నారు.
చాలా జాగ్రత్తగా ప్రాపర్టీలను ఎన్నుకొని బయ్యర్ల ముందు ప్రదర్శనకు ఉంచామని తెలిపారు. ఈ ప్రాపర్టీ షోతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరిన్ని అవకాశాలు క్రియేట్ అవుతాయని క్రెడాయ్ జనరల్ సెక్రెటరీ జగన్నాథ రావు అన్నారు. గ్లోబల్ కంపెనీలు సిటీకి వస్తాయని, రాష్ట్ర ఎకానమీ వృద్ధి చెందుతుందని చెప్పారు.