- ఇండియా వెళ్లిపోవాలని చెప్పిన ఇమ్మిగ్రేషన్ అఫీషియల్స్
- 24 గంటల ఇక్కట్ల తర్వాత రూట్ క్లియర్
- క్వారంటైన్ హోటల్లో వాటర్, ఫుడ్ ప్రాబ్లమ్
- వ్యాక్సిన్ వేసుకోలేదని ఏడుగురిని ఎయిర్ పోర్టులో ఆపేశారు
కరీబియన్ దీవుల్లో జరిగిన అండర్–19 వరల్డ్కప్ ఇండియాకు ఓ మధుర జ్ఞాప కం. ఖతర్నాక్ ఆటతో యశ్ ధూల్ కెప్టెన్సీ లోని ఇండియా అండర్19 టీమ్ ఆ మెగా టోర్నీలో గెలిచి ఐదోసారి వరల్డ్ ట్రోఫీ కైవసం చేసుకుంది. విన్నింగ్ టీమ్లోని ప్లేయర్లంతా ఒక్కసారిగా స్టార్లయ్యారు. ఐపీఎల్ కాంట్రాక్టుతో కొంతమంది ఓవర్నైట్లోనే కోటీశ్వరులయ్యారు. కానీ, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు ఈ కప్పు నెగ్గే క్రమంలో ఇండియా కుర్రాళ్లు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
న్యూఢిల్లీ: అండర్19 వరల్డ్ కప్ మధ్యలో పలువురు ప్లేయర్లకు కొవిడ్ ఎఫెక్ట్ అవ్వడం ఇండియా టీమ్కు అతి పెద్ద సవాల్. కానీ, అంతకంటే ముందు నుంచే ఇండియా యంగ్స్టర్స్ చాలా కష్టపడ్డారు. ఈ టోర్నీ కోసం కరీబియన్ దీవుల్లో అడుగు పెట్టేందుకే వాళ్లు 24 గంటల పాటు ఎయిర్పోర్టులో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆపై టోర్నీకి ముందు క్వారంటైన్లో ఉన్నప్పుడు హోటల్ రూమ్స్లో వాటర్, ఫుడ్ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ప్రాక్టీస్ టైమ్లో స్టేడియంలోని వాష్ రూమ్స్లో నీళ్లు లేక అవస్థలు ఎదుర్కొన్నారు. వీటిని పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరించిన ఇండియా టీమ్ మేనేజర్ లోబ్జాంగ్ టెంజింగ్ చెప్పడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చుట్టుముట్టిన సెక్యూరిటీ గార్డులు
ఈ టోర్నీ కోసం దుబాయ్ నుంచి ట్రినిడాడ్కు లాంగ్ జర్నీ చేసిన ఇండియా టీమ్కు అక్కడి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్పోర్ట్లోనే తొలి షాక్ తగిలింది. టీమ్లో వ్యాక్సిన్ వేసుకోని ఏడుగురు ప్లేయర్లను అధికారులు అడ్డుకుని ‘ఇండియాకు తిరిగి వెళ్లండి’ అని చెప్పేశారు. ఇందులో స్టార్ ప్లేయర్లు రవి కుమార్, రఘువంశి కూడా ఉన్నారు. ‘పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో దిగిన తర్వాత మేం చార్టెడ్ ఫ్లైట్లో గయానా వెళ్లాల్సింది. కానీ, వ్యాక్సిన్ వేసుకోలేదన్న కారణంగా మా టీమ్లో ఏడుగురిని అడ్డుకున్నారు. ఇండియాలో ఆ ఏజ్ వాళ్లకు వ్యాక్సినేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదని ఇమ్మిగ్రేషన్ అఫీషియల్స్కు వివరించినా వాళ్లు వినలేదు. తర్వాతి ఫ్లైట్లో ఇండియా వెళ్లిపోవాలని చెప్పారు. మేం ఎక్కడికైనా పారిపోతామేమోనని సెక్యూరిటీ గార్డులు చుట్టుముట్టారు. ఆ రోజు రాత్రి ఎయిర్పోర్ట్ దగ్గర్లోని ఓ చిన్న హోటల్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ, లోకల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి సమస్యను పరిష్కరించాయి’ అని లోబ్జాంగ్ చెప్పుకొచ్చాడు.
హోటల్ రూమ్స్లో చుక్కలు
ఎయిర్పోర్ట్ ఎపిసోడ్ తర్వాత గయానా చేరుకున్న టీమ్కు టోర్నీ ఆర్గనైజర్స్ చుక్కలు చూపెట్టారు. టోర్నీకి ముందు ఇండియా.. గయానాలోనే ఐదురోజుల క్వారంటైన్లో ఉండి ప్రాక్టీస్, లీగ్ మ్యాచ్లు కూడా అక్కడే ఆడింది. క్వారంటైన్ టైమ్లోనే టీమ్ మేనేజర్ లోబ్జాంగ్, లాజిస్టిక్స్ మేనేజర్ రవీంద్రన్ పాజిటివ్గా తేలారు. ఐసోలేషన్లో ఈ ఇద్దరికి అక్కడి అధికారులు ఎలాంటి మెడికల్ హెల్ప్ అందించలేదు. ‘హోటల్లో డాక్టర్ లేడు. మెడిసిన్స్ లేవు. టీమ్ ఫిజియోనే మాకు హెల్ప్ చేశాడు. ఐసోలేషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. రూమ్స్లో రెగ్యులర్గా నీళ్లు కూడా రాలేదు. ఫుడ్ విషయంలో ప్లేయర్లు ఇబ్బంది పడ్డారు. లక్కీగా హోటల్కు దగ్గర్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఉండటం మాకు హెల్ప్ అయింది. అలాగే, ప్రాక్టీస్ గేమ్స్ ఆడుతున్నప్పుడు స్టేడియంలోని వాష్రూమ్స్లో నీళ్లు లేవు. ఈ టోర్నమెంట్ బయో బబుల్ హాస్యాస్పదంగా అనిపించింది. అధికారులకు పట్టింపే లేదు. డొమెస్టిక్ ఈవెంట్లను సైతం బీసీసీఐ, మన స్టేట్ యూనిట్లు ఇంతకంటే బాగా ఆర్గనైజ్ చేస్తాయని నేను నమ్మకంగా చెప్పగలను’ అని లోబ్జాంగ్ వివరించాడు.