హైదరాబాద్, వెలుగు: గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ విషయంలో టీఎస్పీఎస్సీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటీ అంశాలపై హైకోర్టులో కేసు నడుస్తుండగానే, ఫైనల్ సెలెక్టెడ్ లిస్టును అధికారులు ప్రకటించారు. దీంతో కోర్టులో కేసు వేసిన అభ్యర్థులంతా ఆందోళన చెందుతున్నారు. రాష్ర్టంలోని ఐదు డిపార్ట్మెంట్ల గురుకులాల్లో 304 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ కోసం 2017లో జూన్ 2న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆయా పోస్టులకు బీఈడీ, పీజీ అర్హతతో ఐదేండ్ల టీచింగ్ అనుభవం, మూడేండ్ల స్కూల్ లేదా కాలేజీ ప్రిన్సిపల్/ హెచ్ఎం గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలని నిబంధనలు పెట్టారు. దీంతో ఆయా పోస్టులకు3 వేల వరకు అప్లికేషన్లు వచ్చాయి. వారందరికీ 2017సెప్టెంబర్ 10న ప్రిలిమ్స్ నిర్వహించి, ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత 1: 7 రెషియోలో మెయిన్స్ కు సెలెక్ట్ చేశారు. ఈ క్రమంలోనే మరో రెండుమూడు సార్లు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి అర్హతలు లేవనే కారణంతో 924 మందిని టీఎస్పీఎస్సీ రిజెక్ట్ చేసింది. కేవలం 288 మందితోనే 2019 సెప్టెంబర్లో ఇంటర్వ్యూలు నిర్వహించింది. చివరికి 187మందిని ప్రిన్సిపల్ పోస్టులకు సెలెక్ట్ చేస్తున్నట్టు తాజాగా లిస్టు ప్రకటించింది.
కేసు కోర్టులో ఉండగా ఎట్ల ప్రకటిస్తరు?
మొత్తం టీచింగ్ ఎక్స్పీరియెన్స్ కాకుండా, బీఈడీ, పీజీ పూర్తయిన తర్వాతే ఐదేండ్ల అనుభవం ఉండాలనే దానిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో పాటు ఇంటర్వ్యూలకు అనుమతించాలని కొందరు వెళ్లగా, వారికి కోర్టు పర్మిషన్ ఇచ్చిందని అభ్యర్థులు చెప్తున్నారు. అయితే సెలెక్ట్ లిస్టులో మాత్రం వారి రిజల్ట్ ను పెండింగ్లో పెట్టారు. ప్రిన్సిపల్ పోస్టుల భర్తీపై హైకోర్టులో దాదాపు 110 కేసులు దాఖలు కాగా, ఇంకా 45 కొనసాగుతున్నాయి. రూల్స్ ప్రకారమే సెలెక్టెడ్ లిస్టు ప్రకటించామని, కోర్టు తుది తీర్పునకు లోబడే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుందని టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.