- ఖర్చుకు వెనుకాడకుండా.. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు
- భద్రాచలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం, లక్ష్మీపురం ఇండస్ట్రియల్ ఏరియా కావడమే ప్రధానకారణం
- దశాబ్దం తర్వాత భద్రాచలం గ్రామపంచాయతీకి ఎన్నికలు
- టెంపుల్ డెవలప్మెంట్ పేర ఏకగ్రీవాలకు స్కెచ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అందరి దృష్టి భద్రాచలం, లక్ష్మీపురం గ్రామ పంచాయతీలపైనే ఉంది. ఈ పంచాయతీల్లో రూ.కోటికిపైగా ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం గ్రామపంచాయతీని దక్కించుకునేందుకు పొలిటికల్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. మొదటి దశ ఎన్నికల్లోనే భద్రాచలం గ్రామపంచాయతీకి ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు దశాబ్దానికి పైగా భద్రాచలం గ్రామపంచాయతీకి ఎన్నికలు లేవు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న భద్రాచలం పంచాయతీ ఎన్నికలు జిల్లా ప్రజలకు హాట్ టాపిక్ గా మారింది. భద్రాచలం మండలంలో భద్రాచలం గ్రామపంచాయతీ ఒక్కటే ఉంది. ఈ పంచాయతీలో 20వార్డులున్నాయి.
పంచాయతీ ఎస్టీ జనరల్గా రిజర్వ్ అయింది. ఎస్టీ జనరల్కు ఐదు వార్డులు, ఎస్టీ మహిళ ఐదు, అన్ రిజర్వుడు ఐదు, అన్ రిజర్వుడు మహిళకు ఐదు చొప్పున వార్డులు రిజర్వ్ అయ్యాయి. టెంపుల్ సిటీగా పేరొందిన భద్రాచలం గ్రామపంచాయతీని దక్కించుకునేందుకు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కసరత్తు చేపట్టారు. సీపీఐతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. సీపీఎం, సీపీఐతో బీఆర్ఎస్ నేతలు రాయభారం సాగిస్తున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు ఈ గ్రామపంచాయతీని దక్కించుకునేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇండస్ట్రియల్ఏరియాగా పేరొందిన బూర్గంపహాడ్ మండలంలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీని దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. గతంలో ఎస్సీగా రిజర్వ్ అయిన ఈ పంచాయతీని దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్దతుతో పోటీలో ఉన్న ఒక్కో అభ్యర్థి దాదాపు రూ. 60లక్షలకు పైగానే ఖర్చు చేసిన దాఖలాలున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించారు. ఈ సారి లక్ష్మీపురం గ్రామపంచాయతీ జనరల్గా కావడంతో పోటీ తీవ్రమైంది. గెలుపే లక్ష్యంగా ఒక్కో అభ్యర్థి రూ. కోటికి పైగా ఖర్చు పెట్టేందుకు ముందుకువస్తున్నారు. ఈ పంచాయతీలో అటు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారింది.
టెంపుల్పేరుతో ఏకగ్రీవాలకు..
చంద్రుగొండ, బూర్గంపహాడ్ మండలాలతో పాటు పలుచోట్ల టెంపుల్స్ డెవలప్మెంట్ పేరుతో పంచాయతీ పెద్దలు ఏకగ్రీవాలకు శ్రీకారం చుడుతున్నారు. తాము అడిగినంత ఇస్తే ఏకగ్రీవం చేస్తామంటూ పలు చోట్ల గ్రామ పంచాయతీ పెద్దలు పోటీచేసే అభ్యర్థులతో పాటు వారికి మద్దతు ఇస్తున్న పార్టీల ముఖ్యులతో మంతనాలు సాగిస్తుండడం గమనార్హం.
