- మార్కెట్కు క్రూడ్ దెబ్బ
- 656 పాయింట్లు పడిన సెన్సెక్స్
- వరస రెండు సెషన్లలో 1,100 పాయింట్లకు పైగా లాస్..రూ. 5.24 లక్షల కోట్లు ఆవిరి
- ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడి
న్యూఢిల్లీ: మార్కెట్లు వరసగా రెండో సెషన్లోనూ భారీగా నష్టపోయాయి. మిడిల్ ఈస్ట్లో టెన్షన్లు చెలరేగడంతో గ్లోబల్గా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు యూఎస్ బాండ్ ఈల్డ్లు పెరగడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటే మన మార్కెట్లు కూడా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ బుధవారం సెషన్లో 656 పాయింట్లు (1.08 శాతం ) తగ్గి 60,099 వద్ద ముగిసింది. నిఫ్టీ కీలకమైన 18,000 లెవెల్ను కోల్పోయింది. ఈ ఇండెక్స్ బుధవారం సెషన్లో 174.65 పాయింట్లు (0.96 శాతం) నష్టపోయి 17,938 వద్ద క్లోజయ్యింది. ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 1.37 లక్షల కోట్లు తగ్గింది. గత రెండు సెషన్లలో సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా లాస్ అవ్వగా, ఇన్వెస్టర్ల సంపద రూ. 5.24 లక్షల కోట్లు తగ్గింది. సెక్టార్ల పరంగా చూస్తే ఐటీ, టెలికం, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మీడియా, ఆటో, పీఎస్యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు లాభపడ్డాయి. గ్లోబల్గా చూస్తే, టోక్యో, షాంఘై, సియోల్ మార్కెట్లు నష్టాల్లో క్లోజయ్యాయి. హాంకాంగ్ మార్కెట్ స్వల్ప లాభంతో ముగిసింది. యూరప్లోని మెజార్టీ మార్కెట్లు నష్టాల్లో ఓపెన్ కాగా, తర్వాత లాభాల్లోకి వచ్చాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 14 పైసలు పెరిగి 74.44 వద్ద సెటిలయ్యింది. బ్రెంట్ క్రూడాయిల్ 0.94 శాతం పెరిగి బ్యారెల్ 88.33 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఎనలిస్టులు ఎమన్నారంటే..
1) ఇన్ఫ్లేషన్ పెరగడంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడం తగ్గిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. దీనికి తోడు యూఎస్ బాండ్ ఈల్డ్లు పెరగడంతో పాటు, మిడిల్ ఈస్ట్లో నెలకొన్న టెన్షన్ల వలన ఆయిల్ ధరలు పెరగడంతో మార్కెట్లు పడుతున్నాయని చెప్పారు. వీటికి అదనంగా విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ల నుంచి వెళ్లిపోతుండడం కూడా పతనానికి కారణమన్నారు.
2) నిఫ్టీ 18,000 లెవెల్కు కింద ఉన్నంత వరకు మార్కెట్లలో బలహీనత కొనసాగుతుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ చందన్ తపారియా అన్నారు. ఈ లెవెల్కు కింద ఉన్నంత వరకు నిఫ్టీ 17,850, 17,777 వరకు పడొచ్చని అంచనావేశారు. ఈ ఇండెక్స్కు 18,081, 18,200 లెవెల్స్ వద్ద రెసిస్టెన్స్ ఉందని చెప్పారు.
3) యూఎస్ బాండ్ ఈల్డ్లు రెండేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో మార్కెట్లు వరసగా రెండో సెషన్లోనూ పడ్డాయని ఈక్విటీ 99 కో-–ఓనర్ రాహుల్ శర్మ అన్నారు. మార్కెట్లో బలహీనత మరో రెండు వారాల వరకు కొనసాగొచ్చని అంచనావేశారు. ‘ఇన్వెస్టర్లు స్టాప్ లాస్ను స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. షేర్లు పడిన తర్వాతే కొనాలి. మార్కెట్ట్లో వోలటాలిటీ బడ్జెట్ సెషన్ వరకు కొనసాగుతుందని అంచనావేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఓవర్ ట్రేడ్ (అతిగా) చేయొద్దని సలహా ఇస్తున్నాం’ అని రాహుల్ అన్నారు. నిఫ్టీకి 17,880 దగ్గర సపోర్ట్ ఉందని, ఈ లెవెల్ను కూడా కోల్పోతే 17,765 వరకు పడొచ్చని అంచనావేశారు. పైన 17,980 లెవెల్ నిఫ్టీకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉందని, ఈ లెవెల్ను దాటి వెళితే 18,075, 18,200 వరకు ఈ ఇండెక్స్ వెళ్లొచ్చని అన్నారు.
4) గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవ్వడంతో సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం నష్టాల్లో ఓపెన్ అయ్యాయని హెమ్ సెక్యూరిటీస్ పీఎంఎస్ హెడ్ మోహిత్ నిగమ్ అన్నారు. సెషన్ అంతా నష్టాల్లోనే ట్రేడయ్యిందని చెప్పారు. టెక్నికల్గా చూస్తే, నిఫ్టీకి 18,300 కీలకమైన రెసిస్టెన్స్గా పనిచేస్తుందని, 17,700 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుందన్నారు. బ్యాంక్ నిఫ్టీకి 38,500 రెసిస్టెన్స్గా, 37,500 లెవెల్ సపోర్ట్గా ఉంటుందని అంచనావేశారు.
5) 18,000 లెవెల్ కింద నిఫ్టీ క్లోజ్ అవ్వడం మార్కెట్కు నెగెటివ్ అని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ శ్రీకాంత్ చౌహన్ అన్నారు. నిఫ్టీ 17, 820–18,050 లెవెల్ మధ్య కన్సాలిడేటెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 17,960 లెవెల్ నిఫ్టీకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని, ఈ లెవెల్ను దాటితే 18,000–18,050 వరకు వెళ్లొచ్చని అన్నారు. 17,900 లెవెల్ కోల్పోతే 17,850– 17,820 వరకు పడొచ్చని చెప్పారు.