- క్రిప్టోలు డేంజరే!
- బ్యాంకుల దగ్గర సరిపడ క్యాపిటల్ ఉంది: ఆర్బీఐ
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలు డేంజర్ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి పేర్కొన్నారు. వీటికి ఎటువంటి అండర్లైంగ్ (రియల్) అసెట్స్ నుంచి వాల్యూ క్రియేట్ అవ్వడం లేదని అన్నారు. క్రిప్టోలు ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని చెబుతూనే, వీటిని కంట్రోల్ చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ 25 వ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ పేర్కొంది. క్రిప్టో కరెన్సీలు హై స్పెక్యులేటివ్ (వాల్యూ ఊహించడం) అసెట్స్ అని ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, క్రిప్టో కరెన్సీలకు సంబంధించి కన్సల్టేషన్ పేపర్ను ఆర్బీఐ రెడీ చేసింది. ఇందుకు గాను క్రిప్టో ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్, కంపెనీల నుంచి అభిప్రాయాలను తీసుకుంది. వివిధ కారణాలతో గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ (ధరల పెరుగుదల) పెరుగుతోంది. ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేయడానికి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ మానిటరీ పాలసీలను కఠినతరం చేస్తున్నాయి. దీంతో గ్లోబల్గా లిక్విడిటీ పరిస్థితుల్లో భారీగా మార్పులొచ్చాయని ఆర్బీఐ రిపోర్ట్ వెల్లడించింది. ‘లిక్విడిటీ పరిస్థితులు మారడం క్రిప్టో కరెన్సీలపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఒక స్టేబుల్ కాయిన్ తన వాల్యూ మొత్తం కోల్పోయింది. మరో స్టేబుల్ కాయిన్ యూఎస్ డాలర్ నుంచి డీపెగ్గింగ్ (లింక్ను తీసేయడం) అయ్యింది’ అని వివరించింది.
బ్యాంకులు బలంగానే..
మరోవైపు దేశంలోని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీ) రిస్క్ అసెట్స్ (మొండిబాకీలుగా మారే అవకాశం ఉన్న అసెట్స్) కోసం కేటాయించిన క్యాపిటల్ పెరిగిందని ఆర్బీఐ రిపోర్ట్ పేర్కొంది. క్యాపిటల్ టూ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో (సీఆర్ఏఆర్) ఈ ఏడాది మార్చిలో 16.7 శాతానికి పెరిగిందని, బ్యాంకుల గ్రాస్ ఎన్పీఏల రేషియో ఆరేళ్ల కనిష్టమైన 5.9 శాతానికి తగ్గిందని వివరించింది. ఇన్ఫ్లేషన్ ఒత్తిళ్లు పెరుగుతున్నప్పటికీ దేశ ఎకానమీ రికవరీ బాటలోనే ఉందని వెల్లడించింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల దగ్గర సరిపడ క్యాపిటల్ ఉందని పేర్కొంది.