షకీల్​ మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్..వడ్లు మాయం

షకీల్​ మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్..వడ్లు మాయం
  • మాజీ ఎమ్మెల్యే ​కుటుంబీకుల రైస్​ మిల్లుల్లో అధికారుల సోదాలు

నిజామాబాద్, వెలుగు :  నిజామాబాద్​ జిల్లా బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్  ఆమెర్​ కుటుంబానికి చెందిన  మూడు రైస్​మిల్లుల్లో  సివిల్​సప్లయ్​ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారు. రూ.70 కోట్ల విలువైన 33,328 మెట్రిక్​ టన్నుల కస్టమ్​ మిల్లింగ్​ వడ్లు  మాయమైనట్లు అనుమానిస్తున్నారు. ఈ మిల్లులకు  2021–22  యాసంగి,  2022–23 వానాకాలం  సీజన్లలో 50,732 మెట్రిక్​ టన్నుల వడ్లు ఇచ్చారు.  టెక్నికల్​సమస్యలతో మిల్లులు నడవడం లేదంటూ వడ్లను  బోధన్, వర్ని, ఎడపల్లి, పెగడాపల్లిల్లోని ఇతర  మిల్లర్లకు తరలించారని సివిల్​సప్లయ్​ఆఫీసర్లకు మిల్లర్లు చెప్పారు. ఆయా మిల్లర్ల నుంచి తామే సీఎంఆర్​ కు అప్పగిస్తామని లెటర్లు తీసుకుని ఆఫీసర్లకు ఇచ్చారు. రెండు సీజన్లకు సంబంధించి  17,404 మెట్రిక్​ టన్నుల వడ్ల బాపతు  రైస్​ మాత్రమే అప్పగించారు. మిగతా 33,328 టన్నులపై చేతులెత్తేశారు.

నాలుగు రోజుల కింద మిల్లులను తనిఖీ చేసిన హైదరాబాద్​టాస్క్​ఫోర్స్​టీమ్..​ వడ్ల నిల్వలు లేకపోవడంతో జిల్లా సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చింది. దీంతో శుక్ర, శనివారాల్లో  డీఎస్ఓ చంద్రప్రకాశ్, డీఎం జగదీశ్, తహసీల్దార్​ గంగాధర్, డీటీ నిఖిల్​రాజ్​ తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యే బంధువులు తమకు వడ్లు తరలిస్తున్నట్టు ముందుగానే తమతో లెటర్ల మీద సంతకాలు తీసుకున్నారని,  వడ్లు మాత్రం సరఫరా కాలేదని అగ్రిమెంట్​ చేసుకున్న మిల్లర్లు  అధికారులకు చెప్పారని తెలుస్తోంది. తమ మిల్లులు టెక్నికల్​ సమస్యలతో పనిచేయడం లేదని షకీల్​ కుటుంబ సభ్యులు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.