సైబర్ క్రైమ్.. దీని గురించి రాస్తే చరిత్ర అవుతుందేమో. నిత్యం ఎవరో ఒకరు ఏదో చోట బాధితులు డబ్బులు పోగొట్టుకోవడం.. పోలీసులను ఆశ్రయించడం ఇదే తంతు. విద్యావంతులు సైతం ఈ లిస్ట్లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా ఓ మహిళ.. కొరియర్ డెలివరీ సైబర్ క్రైమ్లో రూ.లక్ష 38 వేలు పోగొట్టుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. .. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్కి చెందిన 25 ఏళ్ల మితీక్షా షెత్బట్టల పార్శిల్ఆర్డర్ చేశారు. అయితే 2–3 రోజులైనా పార్శల్ రాకపోవడంతో టైలర్ కి ఫోన్ చేసింది. టైలర్పార్శల్ని అప్పుడే పంపానని చెప్పడంతో కంగు తింది. అదే సమయంలో కొరియర్ సంస్థ ద్వారా తాను చేసిన లావాదేవీలు గుర్తొచ్చాయి.
ఆమె ఆర్డర్ ఇచ్చాక దాన్ని ట్రాక్ చేయడానికి ఫోన్కి వచ్చిన లింక్పై క్లిక్ చేసింది. మొదట రూ5 చెల్లించి త్వరగా ఆర్డర్ పొందాలనుకుంది. మళ్లీ రూ.5 చెల్లించనమనడంతో అలాగే చేసింది. తరువాత అనుమానం వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తే ఇంకేముందీ... అందులోని రూ.లక్ష 38 వేలు మాయమయ్యాయి. డబ్బుల్ని సైబర్ నేరగాళ్లు దోచేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
మే నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో వస్తున్నారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియన ఈ మెయిల్స్.. మెసెజెస్.. తదితర లింకులను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.