ఏకంగా ఎంపీ ఖాతానే ఖాళీ చేశారు

ఏకంగా ఎంపీ ఖాతానే ఖాళీ చేశారు
  • రూ.99,999 కొట్టేసిన వైనం

చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేశారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా తన సేవింగ్స్ అకౌంట్​లోంచి రూ.99,999 క్యాష్ దోచేశారని ఆయన మంగళవారం చెన్నై పోలీస్ కమిషనర్​కు పిర్యాదు చేశారు. తన ఫోన్​కు ఎలాంటి ఓటీపీ కూడా రాలేదని, ఒకే ట్రాన్సాక్షన్​లో డబ్బు ఖాళీ చేశారని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనకు ముందు తన భార్యకు 2 వేర్వేరు నంబర్ల నుంచి 3 కాల్స్ వచ్చాయని చెప్పారు. తన భార్యతో గోపాలపురం బ్యాంక్​లో జాయింట్ అకౌంట్ ఉన్నప్పటికీ ఆమె ఫొన్ నంబర్​ మాత్రం ఖాతాకు అటాచ్ చేసి లేదని వివరించారు. ఆమె కాల్స్ మాట్లాడి పెట్టేసిన కొద్దిసేపట్లోనే అకౌంట్​లోంచి డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడేవాళ్లపై చర్యలు తీసుకోవాలని దయానిధి మారన్ కోరారు.