
జీడిమెట్ల, వెలుగు: ఐఏఎస్ నవీన్ మిట్టల్ పేరిట ఓ మహిళను సైబర్ నేరగాళ్లు మోసగించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్ పేట్ బషీరాబాద్కు చెందిన ఓ మహిళకు గత నెల 21న ఐఏఎస్ నవీన్ మిట్టల్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఐడీ నుంచి మేసేజ్ వచ్చింది. తన ఫ్రెండ్ సీఆర్పీఎఫ్కి చెందిన సుమిత్కుమార్కు హైదరాబాద్ నుంచి జమ్మూకి ట్రాన్స్ ఫర్ అయిందని, అతని ఇంటి సామగ్రి తక్కువ ధరకు అమ్ముతున్నాడని తెలిపారు.
ఆమె గతంలో నవీన్ మిట్టల్ వద్ద పని చేయడంతో మేసేజ్ నిజమేనని నమ్మింది. కొద్ది సేపటికే మరో వ్యక్తి ఫోన్ చేసి ఫర్నిచర్కు మొదట రూ.50 వేలు చెల్లించాలని మిగతా రూ.35 వేలు డెలివరీ అయ్యాక ఇవ్వాలని చెప్పాడు. వెంటనే బాధితురాలు రూ.50 వేలు చెల్లించింది. అనంతరం అతడు ఆమె నెంబర్ బ్లాక్ చేశాడు. మోసపోయానని తెలుసుకుని పేట్బషీరాబాద్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.