అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్​ : యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ భారీ సెక్స్ రాకెట్ ను ఛేదించిందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 17 మందితో కూడిన సెక్స్ రాకెట్ ముఠాను అరెస్ట్ చేశామన్నారు. 15 సిటీల నుండి యువతులను రప్పించి సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారని వెల్లడించారు. వెబ్ సైట్, వాట్సాప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి.. అమ్మాయిలను పంపిస్తున్నారని చెప్పారు. 39 కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. 1419 మంది అమ్మాయిలు వ్యభిచార ముఠాలో చిక్కుకున్నట్లు గుర్తించామన్నారు. 

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు విదేశీ మహిళలతో సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. సెక్స్ రాకెట్స్ తో పాటు డ్రగ్స్ కూడా సప్లై చేస్తూ కస్టమర్లకు ఎర వేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే సైబరాబాద్ లో ఐదు కేసులు నమోదు చేసి, విచారిస్తున్నామన్నారు. సరఫరాదారులు, బ్రోకర్లు ద్వారా బాధిత మహిళలను కస్టమర్లు దగ్గరకు పంపుతున్నారని చెప్పారు. విమానాల్లో కూడా అమ్మాయిలను ఇతర రాష్ట్రాల కస్టమర్ల దగ్గరకు పంపుతున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్ కత్తాకు చెందిన వారు బాధితులు ఉన్నారని చెప్పారు. బంగ్లాదేశ్, నేపాల్, రష్యాకు చెందిన అమ్మాయిలతోనూ సెక్స్​ రాకెట్​ దందా నడిపిస్తున్నారని చెప్పారు. 

వ్యభిచారం ద్వారా వచ్చిన డబ్బులో 30శాతం బాధిత యువతులకు, 35శాతం యాడ్స్, వెబ్ సైట్స్​ కు మిగతా 35 శాతం నిర్వాహకులు తీసుకుంటారని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఆర్నావ్ అనే వ్యక్తి కీలక నిందితుడని చెప్పారు. 915 మంది అమ్మాయిలను ముంబై, కోల్ కత్తా నుండి తీసుకొచ్చాడని చెప్పారు. 2019 నుండి సమీర్ అనే వ్యక్తి 850 మంది అమ్మాయిలను సరఫరా చేశాడని తెలిపారు. ఏపీలోని అనంతపురం, తెలంగాణలోని కరీంనగర్ నుండి సెక్స్ రాకెట్ నడుపుతున్నారని చెప్పారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ లో ఆర్నావ్ డ్రగ్స్, వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడని వెల్లడించారు. 950 మంది అమ్మాయిలతో హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని తెలిపారు. 

సోమాజిగూడలో కీలక నిందితుడు ఆర్నావ్ ను అరెస్ట్​ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఆర్నావ్ ఉంటున్న ఇంట్లోనే MDMA డ్రగ్స్ ను సీజ్ చేశామన్నారు. సెక్స్ రాకెట్ ముఠా సభ్యులు వివిధ గ్రూపులుగా విడిపోయి దందా చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో కొన్ని హోటల్స్ లో పని చేసే వాళ్ల కూడా ప్రమేయం ఉందని, వారిని కూడా అరెస్ట్ చేశామన్నారు. ఉద్యోగాలు లేని  అమ్మాయిలను, పేదరికంలో ఉన్న యువతులను జాబ్స్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని తమ విచారనలో వెల్లడైందని చెప్పారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు.