- మూడేండ్లలోనే భారీగా పెరిగిన నేరాలు
- 2018లో 1,208 కేసులు ఈ ఏడాది 8 నెలల్లోనే
- 9,340 కేసులు నమోదు పెరిగిన హ్యాకింగ్, ఈ-మెయిల్ మోసాలు
- 2018 నుంచి 2021 ఆగస్టు వరకు సైబర్ క్రైమ్ కేసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ మూడేండ్లలోనే 700 శాతం పెరిగాయి. 2018లో 1,208 కేసులు నమోదైతే.. ఈ ఏడాది ఆగస్టు నాటికే 9,340 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సగటున నెలకు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇవన్నీ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినవే.. బయటకు రానోళ్లు ఇంకా చాలా మందే ఉంటారని అధికారులు అంటున్నారు. పరువుపోతుందన్న ఉద్దేశంతో ముందుకు రావడం లేదని చెప్తున్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో తెలంగాణ నుంచే 10 శాతం దాకా ఉంటున్నాయని చెప్తున్నారు. కరోనా ఫస్ట్వేవ్, సెకండ్వేవ్ టైంలోనే నేరాలు భారీగా పెరిగాయంటున్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచే నేరాలు జరుగుతున్నట్టు తేల్చారు. మొన్నటిదాకా హైదరాబాద్ వరకే ఉన్న సైబర్ నేరాల కేసులు ఇప్పుడు జిల్లాల్లోనూ నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని సర్కారు అనుకున్నా.. అది ఆలోచనలకే పరిమితమైంది.
హైదరాబాద్లోనే ఎక్కువ
జిల్లాల్లోనూ సైబర్ క్రైమ్ కేసులు వెలుగు చూస్తున్నా.. హైదరాబాద్లోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి. 2018 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు హైదరాబాద్ సిటీలో 7,423 కేసులు నమోదయ్యాయి. తర్వాత రాచకొండ కమిషనరేట్లో ఈ ఒక్క ఏడాదే 3,757 కేసులు వచ్చాయి. ఈ మూడేండ్లలో 4,440 కేసులను రిజిస్టర్ చేశారు. సైబరాబాద్ లో 3,327 కేసులు, రాష్ట్రంలో ఉన్న సైబర్ క్రైమ్ యూనిట్లలో మరో 1,074 కేసులు నమోదయ్యాయి.
ఫేక్ ఐడీలు, ఓటీపీలతో దోపిడీ
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. మంచి గొంతుతో బోల్తా కొట్టించి బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుంచి సొమ్ము దోచేస్తున్నారు. సొసైటీలో పేరున్న వ్యక్తులు, ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్న వారి పేర్లతో ఫేస్బుక్లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి.. ఫ్రెండ్ రిక్వెస్ట్లను పంపి.. అర్జంట్ అవసరాలంటూ డబ్బులు కాజేస్తున్నారు. తమవారు ఆపదలో ఉన్నారంటూ ఇంకొందరు బురిడీ కొట్టిస్తున్నారు. కొందరు నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్ రెన్యువల్, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను అప్డేట్ చేస్తున్నామని చెప్తూ.. ఓటీపీలు పంపించి వాటిని తెలుసుకుని సొమ్ము కాజేస్తున్నారు.
ఏడాది కేసులు
2018 1,208
2019 2,698
2020 5,006
2021 9,340
ఎక్కువగా ఆర్థిక నేరాలే
సైబర్ క్రైమ్ నేరాల్లో ఎక్కువగా ఆర్థిక సంబంధమైనవే ఉంటున్నాయి. ఫిర్యాదులు వేల సంఖ్యలో వస్తున్నాయి. దీంతో సైబర్ క్రైమ్ సిబ్బందికీ అది తలకు మించిన భారమవుతోంది. నిందితుల్లో ఎక్కువ మంది బయటి రాష్ట్రాలకు చెందినోళ్లే ఉంటున్నారని, వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్తే ఇక్కడి కేసుల దర్యాప్తు పెండింగ్లో పడుతోందని అధికారులు చెప్తున్నారు. ఫిర్యాదుల్లో కేవలం 35 శాతం కేసులే కొలిక్కి వస్తున్నాయి. ఓ పక్క క్రెడిట్, డెబిట్ కార్డ్ మోసగాళ్లతో పాటు డేటా చోరీ వంటి కేసులూ పెరుగుతున్నాయి. హ్యాకింగ్, ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ మోసాలూ ఎక్కువయ్యాయి. మొత్తం సైబర్ దాడుల్లో 53 శాతం ఆర్థికపరమైన నష్టాలు కలిగిస్తున్నవనేనని నిపుణులు చెప్తున్నారు.