- ఒంటిపై టర్పంటాయిల్ పోసుకొని నిప్పంటించుకున్న విద్యార్థిని
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో విషాదం
హుస్నాబాద్, వెలుగు: ఒంటికి నిప్పంటించుకొని ఫార్మాడీ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగింది. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు, వేములవాడ దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యుడు వడ్డేపల్లి వెంకటరమణ, వనజ దంపతులకు కూతురు శ్రీజ (22), కొడుకు ఉన్నారు. శ్రీజ హైదరాబాద్లోని ఓ కాలేజీలో ఫార్మాడీ ఫైనలియర్ చదువుతోంది. సోమవారం రాత్రి ఆమె హుస్నాబాద్లోని ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటి డాబాపైకి వెళ్లింది.
కొద్దిసేపటికి డాబాపై నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు అక్కడి వచ్చి చూడగా, శ్రీజ మంటల్లో కాలుతూ మెట్లు దిగుతోంది. ఫస్ట్ ఫ్లోర్కు రాగానే ఆమె మెట్లపై నుంచి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంటల్లో కాలిపోతున్న శ్రీజను చూసిన ఆమె తల్లి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే స్థానికులు శ్రీజను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయిందని చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, అక్కడున్న ప్లాస్టిక్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో టర్పంటాయిల్ ఉన్నట్లు గుర్తించారు.
గోడలకు వేసే పేయింటింగ్లో టర్పంటాయిల్ వాడతారని, దానికి పెట్రోల్ మాదిరి మండే స్వభావం ఉంటుందని చెబుతున్నారు. ఆ కెమికల్ను ఒంటిపై పోసుకొని శ్రీజ సూసైడ్ చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే సూసైడ్కు కారణాలు తెలియరాలేదని చెప్పారు. సెకండ్, థర్డ్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయని శ్రీజ తన ఫ్రెండ్స్తో చెబుతూ బాధపడేదని అంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, వెంకటరమణ కూతురు ఆత్మహత్య విషయం తెలిసి మంత్రి ప్రభాకర్ అతని ఇంటికెళ్లి ఓదార్చారు. అనంతరం అంతిమ యాత్రలో శ్రీజ పాడె మంత్రి పొన్నం మోశారు.