ముంబై : దలాళ్ స్ట్రీట్ ఈ వారమంతా బిజీబిజీగా ఉండబోతోంది. ఆరు కంపెనీలు ఐపీఓలు మొదలుపెడుతుండగా, మరో ఐదు లిస్టింగ్కు రెడీ అవుతున్నాయి. కన్జూమర్ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్ మేకర్ ఆర్ఆర్ కాబెల్ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 13–15 మధ్య ఉంటుంది. అయితే యాంకర్ బుక్ సెప్టెంబర్ 12న ఒకే రోజు ఉంటుంది. ఈ ఐపీఓలో రూ.180 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తున్నారు. ప్రమోటర్ల నుంచి రూ.1,784 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉంటుంది. ఓఎఫ్ఎస్ ద్వారా 1.72 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్ముతారు. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.983–- రూ.1,035గా నిర్ణయించారు. ఆర్ఆర్ కాబెల్ ఐపీఓ నుంచి రూ.1,964 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని షేర్లు స్టాక్ ఎక్స్చేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో సెప్టెంబర్ 26న లిస్ట్ అవుతాయి.
సంహీ హోటల్స్ ఐపీఓ:
గోల్డ్మ్యాన్ శాక్స్ -మద్దతు గల సంహీ హోటల్స్ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 14 –18 మధ్య ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ను సెప్టెంబర్ 13న తెరుస్తారు. ఇష్యూలో రూ.1,200 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తారు. ప్రస్తుత వాటాదారుల నుంచి 1.35 కోట్ల ఈక్విటీ షేర్ల ఓఎఫ్ఎస్ ఉంటుంది. గుర్గావ్కు చెందిన ఈ కంపెనీ తాజా ఇష్యూ ద్వారా వచ్చే నికర ఆదాయంతో రూ.750 కోట్ల వరకు అప్పుల చెల్లింపు కోసం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగిస్తుంది. ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ కాబట్టి షేర్లు స్టాక్ ఎక్స్చేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో సెప్టెంబర్ 27న లిస్ట్ అవుతాయి,
జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ ఐపీఓ:
సాఫ్ట్వేర్ -యాజ్- ఎ- సర్వీస్ (సాస్) ప్రొవైడర్ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ ఫిన్టెక్ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 14–18 తేదీల్లో ఉంటుంది. ఇది దాదాపు రూ.563 కోట్ల నిధులను సమీకరిస్తుంది. ఐపీఓలో రూ.392 కోట్ల విలువైన షేర్ల తాజా ఇష్యూ ఉంటుంది. ప్రమోటర్లు రాజ్ నారాయణం, అవినాష్ రమేష్ సహా ఎనిమిది మంది వాటాదారులు 1,04,49,816 ఈక్విటీ షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా అమ్ముతారు. జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ ఐపీఓ మెయిన్బోర్డ్ ఐపీఓ. దీని షేర్లు బీఎస్ఈ ఎన్ఎస్ఈలలో సెప్టెంబర్ 27న లిస్ట్ అవుతాయి.
చావ్డా ఇన్ఫ్రా ఐపీఓ:
చావ్డా ఇన్ఫ్రా ఐపీఓ సెప్టెంబర్ 12 – సెప్టెంబర్ 14 మధ్య ఉంటుంది. షేర్ ప్రైస్బ్యాండ్ను రూ.60–రూ.65 మధ్యలో నిర్ణయించారు. రూ.43.26 కోట్ల విలువైన చావ్డా ఇన్ఫ్రా ఐపీఓ పూర్తిగా 6,656,000 ఈక్విటీ షేర్ తాజా ఇష్యూ. ఓఎఫ్ఎస్ భాగం లేదు. ఇది గుజరాత్లోని నివాస, వాణిజ్య ప్రాజెక్టులకు నిర్మాణ సంబంధిత సేవలను అందిస్తుంది. ఇది ఎస్ఎంఈ ఐపీఓ. షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎంఈలో 25న లిస్ట్ అవుతాయి.
కుందన్ ఎడిఫైస్ ఐపీఓ:
కుందన్ ఎడిఫైస్ ఐపీఓ ఈ వారం సెప్టెంబర్ 12న మొదలవుతుంది. ఒక్కో షేరు ధర రూ.91 చొప్పున రూ.25.22 కోట్లు సేకరిస్తారు. ఈ 27.72 లక్షల ఈక్విటీ షేర్ల ఐపీఓ శుక్రవారం, సెప్టెంబర్ 15 న ముగుస్తుంది. కుందన్ ఎడిఫైస్ లిమిటెడ్..ఎల్ఈడీ స్ట్రిప్ లైట్ల తయారీ, అసెంబ్లీ విక్రయాల వ్యాపారంలో ఉంది. షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎంఈలో 26న లిస్ట్ అవుతాయి.
సెల్కార్ గాడ్జెట్స్ ఐపీఓ:
సెల్కార్ గాడ్జెట్స్ పబ్లిక్ ఇష్యూ ఈనెల 15న ఐపీఓ ప్రారంభమవుతుంది. ఈ ఎస్ఎంఈ కంపెనీ ఈక్విటీ షేర్కు రూ.87 నుంచి రూ.92 వరకు బుక్ బిల్డ్ ఇష్యూ ధరను ప్రకటించింది. ఐపీఓ నుంచి రూ.50.77 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది టీవీలు, ఫోన్లు, స్మార్ట్ వేరబుల్స్ ప్రొక్యూర్మెంట్, బ్రాండింగ్ బిజినెస్లో ఉంది. దీని షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎంఈలో సెప్టెంబర్ 28న లిస్ట్ అవుతాయి.