హైదరాబాద్, వెలుగు: జాతీయ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, దళిత ఉద్యమ నేత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమ నాయకుడు ఆవుల బాలానందం (79) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఈసీఐఎల్లో పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు. ఏపీ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన దళిత హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కృషి చేశారు. గండి పేటలో లక్షలాది మాలలతో ‘మాలల అలయ్ బలయ్’నిర్వహించారు. అనేక మంది ఉద్యమ నాయకులను, రచయితలను ప్రోత్సహించారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామికి బాలానందం అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. బీఆర్ అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్స్కి ఫౌండర్ మెంబర్గా, ఎస్సీఆర్పీ సొసైటీకి 25 ఏండ్లు ప్రెసిడెంట్గా బాలనందం పనిచేశారు. ట్యాంక్బండ్ సమీపంలోని అంబేద్కర్ భవన్ మంజూరు కోసం, గురుకులాల స్థాపన కోసం 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ప్రతి కార్యకర్తను పేరుపేరున బాలనందం పలకరించేవారని ఆయన సన్నిహితులు గుర్తుచేసుకున్నారు. మల్లెమాల పత్రికకు చీఫ్ ఎడిటర్గా పనిచేశారు. దళిత రత్న, భాగ్యరెడ్డి వర్మ మెమోరియల్ అవార్డులు ఆయన అందుకున్నారు. ఆది హిందూ భవన్ పరిరక్షణ, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ద్వారా అనేక సేవలు చేశారు. అంతేకాకుండా ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. గురుకులాలను స్థాపించటంలో బాలనందం కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం యావత్ దళిత జాతికి తీరని లోటని మాల సంక్షేమ సంఘం, మాల విద్యావంతుల వేదికల తరఫున ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు డాక్టర్ నిమ్మ బాబురావు, జీవీ రత్నాకర్, ఉత్తం శ్రీనివాస్, ఆస శ్రీరాములు, ముచ్చ పంకజ్ కుమార్, శ్రీకాంత్, నిమ్మ అంజన్కుమార్, నిమ్మ చైతన్య, ఆస సాయి కృష్ణ, సల్ల నర్సింగ్ రావు, అంబటి కృష్ణ, నానం సురేశ్, అస మహేశ్ తెలిపారు.
బాలానందం మృతిపై వివేక్ వెంకటస్వామి విచారం
ఆవుల బాలానందం మృతిపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విచారం వ్యక్తం చేశారు. బాలానందం కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి ప్రకటించారు. మాలల హక్కులు, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన బాలానందం మృతి పట్ల పలువురు సామాజిక వేత్తలు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. హైదరాబాద్లోని తన నివాసంలో బాలానందం మృతదేహనికి పలువురు నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు అంబర్పేట్లోని అరాస్పెంట శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.