డేంజర్ జోన్ లో ‘బంగ్లా‘ నదులు

డేంజర్ జోన్ లో ‘బంగ్లా‘ నదులు

1972లో స్వతంత్ర దేశం అయిన ఇన్నేళ్లలో బంగ్లాదేశ్ ఇప్పుడిప్పుడే​ ఆర్థికంగా నిలదొక్కుకుంటోంది.  ఒకవైపు స్థిరంగా పెరుగుతున్న జీడీపీతోపాటు, రెండోవైపున జలవనరులు దారుణంగా దెబ్బతింటున్నాయి. రాజధాని ఢాకాకి సమీపంలో ప్రవహించే బూరిగంగ, తురంగ్​, బాలు, షితలక్యా వంటి నదులన్నీ కలుషితమయ్యాయి. ఢాకా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘నదిని చంపుకోవటం అంటే మనమంతా సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడటమే’ అని తేల్చిచెప్పింది. నదుల కబ్జాదారులు, పొల్యూషన్ కారకులు  ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా బ్యాన్​ చేయాలని ఎలక్షన్​ కమిషన్​ని ఆదేశించింది.

పొరుగు దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్ జీడీపీ​ కొన్నేళ్లుగా 6–7 శాతం మధ్య నిలకడగా ఉంటోంది. గతేడాదైతే స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతంగా నమోదైంది. అభివృద్ధిలో బంగ్లాదేశ్ ఎన్నో దేశాల​ను దాటి ముందుకెళ్లింది. అయితే ఈ ప్రోగ్రెస్​ దేశంలోని అన్ని ప్రాంతాలలో సమాన స్థాయిలో లేకపోవటం పెద్ద లోటు. ఈ అభివృద్ధి మాటున అక్కడి పర్యావరణం, జల వనరులు ఘోరంగా దెబ్బతింటున్నాయి. బంగ్లాదేశ్​లో చిన్న నదులు, పెద్ద నదులు అన్నీ కలిపి మొత్తం సుమారు 230 ఉన్నాయి. జీవనోపాధి, రవాణా వంటి విషయాల్లో వీటిపై ఆధారపడ్డవారి సంఖ్య జనాభాలో 90శాతం వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి.  ఈ నదుల్లో చాలావరకు ఇప్పటికే బాగా కలుషితమయ్యాయి. ఆక్రమణలకు గురయ్యాయి.  నదీ తలాలను (రివర్​ బెడ్లను) ఇష్టమొచ్చినట్లు కబ్జా చేసినవాళ్లలో సంపన్నులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఆఫీసులు కూడా ఉన్నాయని ఢాకా హైకోర్టు ఈ ఏడాది మేలో గుర్తించింది.

ఇదే గనుక జరిగితే బంగ్లాదేశ్​లో నదుల ఆరోగ్యం మరింత క్షీణిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బూరిగంగా అనేది ఆ దేశంలోని ప్రధాన నదుల్లో ఒకటి. ఇది నాలుగేళ్ల క్రితమే తీవ్ర కాలుష్యంలో చిక్కుకున్నట్లు, ఆక్రమణ పాలైనట్లు వెలుగులోకి వచ్చింది. ఆ నదిలోకి కలుషిత జలాలు లోతుగా పేరుకుపోవడంతో నల్లటి జెల్ ​లాంటి లిక్విడ్​లా మారాయి. దేశ రాజధాని ఢాకాలోని హజారీబాగ్​ ఏరియాలో ఉన్న  లెదర్​ ప్రాసెసింగ్​ యూనిట్లు  విషపూరిత వ్యర్థాలను యధాతథంగా ఆ నదిలోకి డంప్​ చేస్తున్నాయి. దీనివల్లే సిటీ పరిధిలోని బూరిగంగా అధ్వాన్నంగా తయారవుతోంది.  సిటీ జనాలు కూడా వివిధ వ్యర్థాలను నదిలో పారబోస్తున్నారు.

ఢాకా సమీపంలోని తురంగ్​, బాలు, షితలక్యా వంటి నదులదీ ఇదే దుస్థితి. నగరంలోని మొత్తం నాలుగు నదుల్లోకి రోజూ 1.5 మిలియన్​ క్యూబిక్​ మీటర్ల వేస్ట్​ వాటర్​ చేరుతున్నట్లు వరల్డ్​ బ్యాంక్​ స్టడీ తేల్చింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని 7000 ఇండస్ట్రియల్​ యూనిట్ల నుంచి కలుషితమైన నీరు కలుస్తోందని గుర్తించింది. ఇతర మార్గాల నుంచి మరో 0.5 మిలియన్​ క్యూబిక్​ మీటర్ల పొల్యూటెడ్​ వాటర్​ నదుల్లోకి ప్రవహిస్తున్నట్లు తెలిపింది.  బంగ్లా నదులను రక్షించుకోవలసిన అవసరాన్ని సర్కారుకు గట్టిగా గుర్తు చేయాలంటూ పర్యావరణవేత్తలు ఢాకా హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటికి ప్రధాని షేక్​​ హసీనా సానుకూలంగా స్పందించి తగు ఆదేశాలిచ్చారు  ప్రజలు చెత్తాచెదారాలను నదుల్లో వేయటం ఆపాలని,  ప్రతి ఇండస్ట్రియల్​ యూనిట్​లోనూ వేస్ట్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్​ ఉండాలని, తద్వారా నదులు పొల్యూట్​ కాకుండా చూడొచ్చని చెప్పారు.   బంగ్లాదేశ్​లో నగరాలు, పట్టణాలు బాగా డెవలప్​ అవుతున్నందున  పల్లె ప్రజలు పెద్దఎత్తున వలస వస్తున్నారు. వలసవాసులకు ఇళ్లు, ఇతర సదుపాయాల అవసరం ఏర్పడుతోంది. అర్బన్​ ఏరియాల్లో పాపులేషన్​ వృద్ధి చెందుతుండటంతో రివర్​ బెడ్ల ఆక్రమణలతోపాటు ఇళ్ల నుంచి వెలువడే చెత్త కూడా కుప్పలు తెప్పలుగా పెరుగుతోంది.

కబ్జాలపై ఢాకా హైకోర్టు హెచ్చరించడం, ప్రధాని హసీనా తీవ్రంగా పరిగణించడం వంటివన్నీ అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చాయి. బంగ్లాదేశ్​ ఇన్​ల్యాండ్​ వాటర్​ ట్రాన్స్​పోర్ట్​ అథారిటీ ఆఫీసర్లు ఢాకా పరిసర ప్రాంతాల్లోని నదుల ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఈ డ్రైవ్​లో భాగంగా దాదాపు 4,000 అక్రమ కట్టడాలను కూల్చేశారు. తద్వారా 77 హెక్టార్ల ల్యాండ్​ను ప్రభుత్వం తిరిగి అధీనంలోకి తీసుకుంది. దేశంలోని అన్ని నదులనూ సంరక్షించాల్సిన బాధ్యతకు సంబంధించి హైకోర్టు డివిజన్​  జాతీయ నదుల పరిరక్షణ కమిషన్​కి చట్టబద్ధమైన హక్కులు కల్పించింది.

కబ్జాకోరులపై కఠిన ఆంక్షలు

ఇటీవలే ఒక కేసులో తీర్పును వెలువరించే సందర్భంలో హైకోర్టు డివిజన్​ బెంచ్​​ కీలక వ్యాఖ్యలు చేసింది. నదిని చంపుకోవటం అంటే మనమంతా కలసికట్టుగా ఆత్మహత్యకు పాల్పడటమేనని తేల్చిచెప్పింది. రివర్​ బెడ్లను కబ్జా చేసినవారు, పొల్యూషన్​కి కారణమైనవారు ఎవరైనాగానీ… అలాంటివారిని కౌన్సిళ్లు, సబ్​–డిస్ట్రిక్ట్​ కౌన్సిళ్లు​, మునిసిపాలిటీలు, సిటీ కార్పొరేషన్, పార్లమెంట్​ ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని ఎలక్షన్​ కమిషన్​ని ఆదేశించింది. ఇలాంటివాళ్లు బ్యాంకుల్లో లోన్లు కూడా పొందలేరని వార్నింగ్​ ఇచ్చింది.

నదుల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని హైకోర్టు డివిజన్ బంగ్లాదేశ్​ విద్యా మంత్రిత్వ శాఖకు సూచించింది. రెండు నెలలకోసారి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, మదర్సాలు సహా అన్ని పబ్లిక్​, ప్రైవేట్​ విద్యా సంస్థలలో గంటసేపు స్పెషల్​ క్లాసులు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఇలాంటి ప్రోగ్రామ్​లు మరిన్ని చేపడితే తప్ప దేశంలోని నదులు కాలుష్యం, కబ్జాల బారి నుంచి బయటపడలేవని చెప్పింది. బంగ్లాదేశ్​ తన గ్రోత్​ రేటును భవిష్యత్​లోనూ కొనసాగించాలంటే​ నదులను కాపాడుకోవటం తప్పనిసరి.

టెక్స్టైల్ ఇండస్ట్రీ వల్లే..

బంగ్లాదేశ్​లో​ నదుల  పొల్యూషన్​కి ముఖ్య కారణం టెక్స్​టైల్​ సెక్టార్​.  అక్కడ దుస్తుల పరిశ్రమ బాగా పురోభివృద్ధి చెందింది. బంగ్లాకి ఎగుమతుల ద్వారా వచ్చే మొత్తం రెవెన్యూలో  82 శాతం టెక్స్​టైల్​ ఇండస్ట్రీయే ఇస్తోంది. అక్కడ కలర్​ఫుల్​ డ్రెస్​ల తయారీలో నేటికీ ప్రాచీన రంగుల పద్ధతులనే పాటిస్తున్నారు. వాటివల్లే నదుల్లోకి వేస్ట్​ వాటర్​ వస్తోందని ఓ స్టడీ గుర్తించింది. ఇప్పటికైనా మేల్కొనకపోలే  మరో రెండేళ్లలో (2021 నాటికి)నదుల్లోకి చేరే కలుషిత జలాలు 349 మిలియన్​ క్యూబిక్​ మీటర్లకు చేరతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.