
వాషింగ్టన్: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారొలిన్ లీవిట్ గురువారం (june 19) మీడియాకు తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై తాను జోక్యం చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చని ట్రంప్ వెల్లడించారని లీవిట్ చెప్పారు.
ఇరు దేశాల మధ్య యుద్ధం విషయంలో జోక్యం చేసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ట్రంప్ వ్యాఖ్యానించారని ఆమె పేర్కొన్నారు. ‘‘ఇరాన్ తో దౌత్యపరమైన పరిష్కారం కోసం ట్రంప్ ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా చూడాలని ఆయన కోరుకుంటున్నరు. అదే ఆయన ఫస్ట్ ప్రయారిటీ. దౌత్యపరమైన పరిష్కారానికే ప్రెసిడెంట్ మొగ్గు చూపుతున్నారు.
ఆయన శాంతిని కోరుకునే వ్యక్తి. కాబట్టి, ఇరాన్ తో దౌత్యపరమైన చర్చలకు అవకాశాన్ని కొట్టివేయలేం” అని లీవిట్ తెలిపారు. కాగా.. ఇరాన్ పై దాడులకు కాంగ్రెస్ ఆమోదాన్ని ట్రంప్ తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు ఆమె జవాబు చెప్పలేదు.