
- దేశానికి ఇబ్బంది కలగొచ్చు: వినేశ్
- నేటితో ముగియనున్న రెజ్లర్ల డెడ్లైన్
న్యూఢిల్లీ: బ్రిజ్ భూషణ్ను అరెస్ట్ చేయకుంటే ఆదివారం పెద్ద నిర్ణయం తీసుకుంటామని, అది దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండొచ్చంటూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న రెజ్లర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు నేతలు (ఖాప్ మహా పంచాయత్) తో కలిసి రెజ్లర్లు విధించిన డెడ్లైన్ ఆదివారంతో ముగియనుంది. ‘పెద్ద వారితో సంప్రదించి పెద్ద నిర్ణయం తీసుకుంటాం. బహుశా అది దేశానికి ఇబ్బంది కలిగించవచ్చు. ఇలా పోరాటం చేయడం అంత సులువు కాదు. ప్రాక్టీస్, పోటీలకు దూరమై మేం చాలా నష్టపోయాం. నిమిషాల్లో పరిష్కరించాల్సిన సమస్యను నెలలుగా సాగదీస్తున్నారు. గతంలో ఢిల్లీలో రైతులు 13 నెలల పాటు చేసిన ఆందోళన దేశానికి ఇబ్బంది కలిగించింది. అలాంటిది మేం కూడా చేస్తే కచ్చితంగా నష్టం జరుగుతుంది’ అని వినేశ్ ఫొగట్ మీడియాతో చెప్పింది. కాగా, శనివారం అరుణ్జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ మ్యాచ్కు వెళ్లకుండా తమను పోలీసులు అడ్డుకున్నారని తెలిపింది.