
పనులు సాగుతున్నాయ్ : దీపమ్ సెక్రటరీ
న్యూఢిల్లీ : ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వ వాటా అమ్మకం పనులు చురుగ్గానే సాగుతున్నాయని, దీనిని వాయిదా వేసే ఆలోచనేదీ లేదని దీపమ్ సెక్రటరీ తుహిన్కాంత పాండే స్పష్టం చేశారు. ఐడీబీఐ బ్యాంక్ వాటా అమ్మకం వాయిదా పడనుందంటూ వచ్చని వార్తలలో నిజం లేదని కొట్టిపారేశారు. ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వం, ఎల్ఐసీలకు ఉన్న వాటాలో 61 శాతం వాటా అమ్మకానికి పెట్టారు.
ఈ వాటా అమ్మడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఐ)లను పిలిచారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఈ ఏడాది జనవరి నెలలో తమ ఈఓఐలను సబ్మిట్ చేశారు. ఈ వాటా అమ్మకం తర్వాత ఐడీబీఐ బ్యాంక్లో ఎల్ఐసీ, ప్రభుత్వ వాటా 34 శాతానికి తగ్గిపోతుంది. వచ్చిన బిడ్స్ను ఆర్బీఐ, ప్రభుత్వం పరిశీలిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఆర్బీఐ నుంచి ప్రోపర్ క్లియరెన్స్లు అవసరమని తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్ మధ్య నాటికి ఈ ట్రాన్సాక్షన్ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.