మజ్గావ్ డాక్స్, ఎల్ అండ్ టీలకు టెండర్
మరో రూ. 6,800 కోట్ల వెపన్స్ కొనుగోలుకూ ఓకే
న్యూఢిల్లీ: సముద్ర జలాల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న టైమ్లో దేశీయంగా అత్యాధునిక సబ్మెరైన్ల తయారీకి ఇండియా సిద్ధమైంది. ఇండియన్ నేవీ కోసం 6 డీజిల్-ఎలక్ట్రిక్ సబ్ మెరైన్లు నిర్మించే మెగా ప్రాజెక్టుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 43 వేల కోట్లు ఖర్చు చేయబోతోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ‘డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఎసీ)’ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్లో ఫారిన్ డిఫెన్స్ కంపెనీలతో కలిసి ఇండియా డిఫెన్స్ కంపెనీలు వీటిని నిర్మించనున్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ‘పీ -75 ఇండియా’గా పేరు పెట్టారు. మజ్గావ్ డాక్స్ లిమిటెడ్ (MDL), లార్సెన్ అండ్ టర్బో(L&T) కంపెనీలకు టెండర్ ఇచ్చారు. ఈ కంపెనీలు ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసిన 5 విదేశీ కంపెనీల్లో ఒకదానితో కలిసి 12 ఏళ్లలో వీటిని రెడీ చేయనున్నాయి. ఇతర మిలటరీ వెపన్స్, పరికరాల కొనుగోలుకు సంబంధించిన రూ.6,800 కోట్ల డీల్ను కూడా డీఏసీ ఓకే చేసింది.
24 సబ్మెరైన్ల కోసం నేవీ ప్లాన్
ప్రస్తుతం ఇండియన్ నేవీ దగ్గర 15 సంప్రదాయ, 2 న్యూక్లియిర్ సబ్ మెరైన్లు ఉన్నాయి. ఆరు న్యూక్లియర్ సబ్మెరైన్లు సహా 24 కొత్త సబ్మెరైన్లు సమకూర్చుకోవాలని నేవీ ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ నావల్ అనాలిసిస్ ప్రకారం చైనా దగ్గర 50కి పైగా సబ్ మెరైన్లు, 350 షిప్పులు ఉన్నట్టు సమాచారం. ఇండియా కూడా 57 క్యారియర్ బార్న్ ఫైటర్ జెట్లు, 111 నావల్ యుటిలిటీ హెలికాప్టర్లు, 123 మల్టీ రోల్ హెలికాప్టర్లను స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్లో సమకూర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. 2024 కల్లా విదేశాల నుంచి 101 రకాల వెపన్లు, మిలటరీ పరికరాల దిగుమతి ఆపేస్తామని ఇండియా ఇప్పటికే వెల్లడించింది.