
దేశ రాజధాని ఢిల్లీలోని ఆజాద్పూర్ మండీని 24 గంటలూ తెరిచేలా ఆదేశాలిచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా బత్తాయి రైతుల సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకున్నానని ఆయన అన్నారు. ” ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ ఆజాద్పూర్ మండీకి అనేక ప్రాంతాల నుంచి పండ్లు వస్తుంటాయి. తెలంగాణలోని నల్గొండ జిల్లా నుంచి బత్తాయి దిగుబడి ఇక్కడికే పంపుతారు. ప్రతి యేటా 30 వేల మెట్రిక్ టన్నుల బత్తాయిని నల్గొండ రైతులు ఢిల్లీకి పంపుతారు” అని తెలిపిన కిషన్ రెడ్డి.. కోవిడ్-19 ముప్పు నేపథ్యంలో మండీలో ఇన్నాళ్లూ పరిమితంగా అమ్మకాలు సాగాయని, 24 గంటలూ తెరిచి ఉంచి రద్దీ లేకుండా అమ్మకాలు సాగేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇకపై ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి పూట కూడా మార్కెట్లో లావాదేవీలు కొనసాగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు.