
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురుకు గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ ఉందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని ఢిల్లీ హైకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. గోవాలో రెస్టారెంట్ బిజినెస్కు సంబంధించి ఎలాంటి లైసెన్సులు వాళ్ల పేరు మీద జారీ కాలేదని రికార్డుల ద్వారా తెలుస్తోందని పేర్కొంది. కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్లు ఆ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ జోయిష్ ఇరానీది కాదని స్పష్టం చేసింది. స్మృతి ఇరానీ, జోయిష్ ఇరానీలపై కుట్రపూరితంగా ఆరోపణలు చేశారని జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు కాంగ్రెస్ లీడర్లపై మంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఈ కామెంట్స్ చేశారు. మంత్రిని టార్గెట్ చేసి, ఉద్దేశపూర్వకంగా నిందలేశారని మండిపడింది. మంత్రిపై ఆరోపణలు గుప్పిస్తూ చేసిన ట్వీట్లను కోర్టు ఆదేశించిన తర్వాత కూడా తొలగించలేదని గుర్తుచేసింది. ట్విట్టర్ కంపెనీ ఆ ముగ్గురు నేతల ట్వీట్లను తొలగిస్తుందని భావిస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు.