- జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య
కొణిజర్ల, వెలుగు : ఖమ్మం జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. మంగళవారం మండలంలోని గోపవరం సహకార సంఘంలో యూరియా నిల్వలను పరిశీలించారు. మొక్కజొన్న సాగయ్యే మండలాల్లో యూరియా దొరకదనే అపోహతో రైతులు పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారని, యూరియా విక్రయాలపై జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారని తెలిపారు.
రైతాంగం ముందస్తు నిల్వలు చేయొద్దని, అవసరాలకు అనుగుణంగా మాత్రమే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు. ఈ డీసీవో గంగాధర్, ఎంఏవో దొడ్డిగర్ల బాలాజీ, సొసైటీ స్పెషల్ ఆఫీసర్ సందీప్, సీఈవో వెంకటేశ్వర్లు ఉన్నారు.
