- లిక్కర్ స్కామ్ కేసులో రాఘవ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన మాగుంట రాఘవరెడ్డి భార్యకు చెన్నైలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో మెడికల్ టెస్టులు చేయించి రిపోర్ట్ సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. లిక్కర్ స్కామ్లో తీహార్ జైలులో ఉన్న రాఘవరెడ్డి.. తన భార్య అనారోగ్యంగా ఉందని, బెయిలివ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సోమవారం కోర్టులో విచారణకు వచ్చింది. చెన్నైలో ఆమె చికిత్స పొందుతున్న ఈఎస్ఐసీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అభ్యంతరం లేదని రాఘవ తరఫు లాయర్ వాదించారు. ఆమెకు వైద్య సేవలందించేందుకు రాఘవకు బెయిలివ్వాలని కోరగా, ఈడీ తరఫు లాయర్లు అభ్యంతరం తెలిపారు. వాదనలు విన్న బెంచ్.. చెన్నైలోని ఈఎస్ఐసీ హాస్పిటల్లో 7 రోజుల్లో రాఘవ భార్యకు హెల్త్ చెకప్లు చేసి, రిపోర్ట్లను ఈడీ, పిటిషనర్లకు అందజేయాలని హాస్పిటల్ సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.