
ఢిల్లీలో మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి. ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురా ఏరియాలో రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి. రోడ్లపైకి వచ్చిన రెండు వర్గాల ఆందోళనకారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలు, పైపులతో కొట్టుకున్నారు. మాస్క్ లు వేసుకుని వచ్చిన ఆందోళనకారులు రోడ్లపై ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. దుకాణాలను తగలబెట్టారు. కర్వాల్ నగర్ ఏరియాలో భద్రతా బలగాలు మోహరించారు. బ్రిడ్జ్ కింద ఉన్న ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ విజ్ఞప్తి చేశారు. శాంతియుత పరిస్థితులను నెలకొల్పేందుకు ఏదైనా చేయాలన్నారు. పోలీసులకు కూడా సాయపడాలని సూచించారు అనిల్ బైజల్.
నిన్నట్నుంచి ఈశాన్య ఢిల్లీలో CAA వ్యతిరేక ఆందోళనలు పెచ్చరిల్లాయి. మౌజ్ పూర్, జఫ్రాబాద్, కర్వాల్ నగర్, విజయ్ పార్క్, యమునా విహార్ ప్రాంతాల్లో సిటిజెన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ కు వ్యతిరేకంగా ఓ వర్గం, అనుకూలంగా మరో వర్గం రోడ్లపైకి వచ్చాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. నిన్నటి అల్లర్లలో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తో పాటు ఆరుగురు సాధారణ పౌరులు చనిపోయారు. ఆందోళనకారులు షాపులు, వాహనాలకు నిప్పు పెట్టడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.