
పేరుకు దేశరాజధాని.. మహామహులు.. రాజకీయ దిగ్గజాలు..దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నవారు ఉండే నగరం ఢిల్లీ.. అయినా సరే అక్కడ నివసించే ప్రజలు ఇబ్బందులు మాత్రం ఎవరికి కనిపించడంలేదు. ఎండాకాలంలో.,. ఎండతో... వర్షాకాలంలో ... చిత్తడి చిత్తడి రోడ్లు.. బురదమయం.. శీతాకాలం చెప్పే పనిలేదు.. మంచు ప్రభావంతో కనపడని రోడ్లు.. ఇలా అనేక సమస్యలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడాల్సిందే.. ఇలాంటి ఇబ్బందులు ఎలా ఉన్నా.. ప్రస్తుతం కురిసిన వర్షాలకు ఢిల్లీ వాతావరణం కూల్ కూల్ గా ఉన్నా.... నీటి కొరత మాత్రం వేధిస్తుంది.
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో కురిసిన వర్షాలకు ఎండల నుంచి ఉపశమనం కలిగినా... నీటి కొరత మాత్రం దేశ రాజధాని ప్రజలను వేధిస్తోంది. శుక్రవారం (జూన్ 7) ఉదయం సంజయ్ క్యాంప్ ఏరియా కు చెందిన ప్రజలు రోజువారి నీటి అవసరాల కోసం ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. కేవలం ఒక్క సంజయ్ క్యాంప్ ఏరియాకు మాత్రమే ఇది పరిమితం కాలేదు. యావత్ నగరం ప్రస్తుతం మంచినీటి కొరతతో సతమతమవుతోంది. ప్రజలు నీటి అవసరాలకు ప్లాస్టిక్ కంటైనర్లలో నీటిని పట్టుకొని తీసుకువెళ్తున్న దృశ్యాలు ఢిల్లీలో నగరంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. నీరు లేక ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో వంట చేసుకోవడంతో పాటు ఇతర అసవరాలకు నీరు లేకుండా పోతోందని వాపోతున్నారు.
ఉదయం 6 గంటలకు ప్లాస్టిక్ క్యాన్లతో జనాలు రోడ్డు ఎక్కుతున్నారు. నీటి ట్యాంకర్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. వాటర్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో తెలియదు... ఎక్కడకు వస్తుందో తెలియదు కాని జనాలు మాత్రం ఉడయం 6గంటల కంటే ముందు నుంచే బారులు తీరతారు. ఇక ట్యాంకర్ వచ్చేది మాత్రం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల లోపు ఎప్పుడైన రావచ్చు. లేదా ఒక్కోరోజు అసలు రాకపోవచ్చు. ఎప్పుడు వస్తుందా అని కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఒక్కోసారి ఒక్క ట్యాంకరే వస్తుందని ఢిల్లీ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇక వచ్చే ట్యాంకర్లు కూడా రోజు విడిచి రోజు వస్తుంది. ఆ ట్యాంకర్ నీరు దుర్గంధం వెదజల్లుతుంది. తాగడానికి లేదా బట్టలు ఉతుక్కోవడానికి ఆ నీరు పనికిరాదు. నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. దీనితో బోర్ నీటి కోసం ఎదురుచూడాల్సిందే.
ఇక నీటి కొరత ఒక వైపు అయితే.. రాజకీయ పార్టీలు మాత్రం తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటున్నారు. మే 31న ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీకి విడుదల చేసే నీటిని హర్యానా ప్రభుత్వం విడుదల చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కాగా ఆప్ ప్రభుత్వం వాదనను హర్యా నా ప్రభుత్వం తోసి పుచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం అడిగినదాని కంటే ఎక్కువ నీరు అందిస్తున్నామని హర్యానా సీఎం నయాబ్ సింగ్ షైనీ ఆప్ ఆరోపణలను తిప్పి కొట్టారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని వెంటనే 137 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది.